రాష్ట్రం విడిపోయినా ‘మా’ విడిపోలేదు, ప్రభావం లేదు: నటుడు సుమన్
విజయవాడ: రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సినీ పరిశ్రమపై ఏ మాత్రం పడలేదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా గన్నవంర మండల పరిధిలోని కేసరపల్లి గ్రామంలో జెడ్పీటిసి సభ్యురాలు మరీదు లక్ష్మీదుర్గ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి చక్కటి సహకరం అందిస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినా ‘మా' విడిపోలేదని, తెలుగు సినీ కళాకారులంతా కలిసే వున్నారని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు విశాఖపట్టణం వాతావరం అనుకూలంగానే వుంటుందన్నారు.
ఇండోర్ షూటింగ్స్కు ఇబ్బందులు వుండవని, అవుట్డోర్ షూటింగ్స్ ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా జరుగుతున్నాయని, బాగున్న సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. కొత్త సినిమాల పరిస్థితి మూడు రోజుల్లో ఫలితాలు తెలిసిపోతున్నాయన్నారు.
పైరసీల వల్ల సినిమాలకు భారీ నష్టం సంభవిస్తుందని, పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాలకృష్ణకు అన్నగా ఓ సినిమాలో తాను నటిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సినిమా షూటింగ్ న్యూఢిల్లీలో జరుగుతుందని, వచ్చేనెల రెండో వారంలో హైదరాబాద్లో జరుగుతుందని సుమన్ చెప్పారు.