బాలకృష్ణ క్వారంటైన్ లుక్: చాలాకాలం తరువాత జనం ముందుకు: సెల్ఫీ వీడియో: రంజాన్ రోజున
అనంతపురం: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత జనం ముందుకు వచ్చారు. క్వారంటైన్ లుక్లో కనిపించారాయన. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనదైన స్టైల్లో కనిపించారు. ముస్లింలు సంప్రదాయబద్ధంగా ధరించే కుర్తా, పైజామా, నెత్తిన టోపీతో డిఫరెంట్ లుక్స్లో అభిమానులకు కనువిందు చేశారు.
ఏపీ విలవిల: ఇప్పట్లో తగ్గేదెలా?: గంటగంటకూ పాజిటివ్ కేసులు: కట్టడి చర్యలు ఎన్ని ఉన్నా
అస్సలామలైకుమ్ అంటూ ముస్లింలకు వారి సంప్రదాయంలో నమస్కరించారు. ముస్లిం సోదరులు ప్రేమ, త్యాగాలకు ప్రతీకలని అన్నారు. వారి భక్తి భావన, క్రమశిక్షణ ఆధ్యాత్మికత ఆదర్శప్రాయమని బాలకృష్ణ కొనియాడారు. వారికి రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నానని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్డౌన్లో ఉంటూ మనోధైర్యాన్ని ముస్లింలు కోల్పోలేదని అన్నారు.
కరోనా వైరస్, లాక్డౌన్ పరిస్థితుల మధ్య వచ్చిన రంజాన్ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కఠోర ఉపవాసాన్ని విడనాడలేదని అన్నారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు ఫలించాలని బాలకృష్ణ అకాంక్షించారు. కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకున్నారు. సకల మానవాళి బాగుండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ముస్లిం సోదరులు ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలను చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలను నింపాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు ఫలించి, త్వరలోనే ఈ ప్రపంచం కరోనా నుంచి విముక్తి అవుతుందని ఆశిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల అనంతరం.. వారు చేసే ప్రార్థనలు ఫలిస్తాయని ఆయన చెప్పారు.