చిత్తూరులో ఘోరప్రమాదం:లోయలో పడిన లారీ...8 మంది మృతి,20 మందికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ లోయలో పడిన దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుప్పం నియోజకవర్గ సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు తెలిపిన వివరాల ప్రకారం...కుప్పం మండలంలోని నాయనూరు నుంచి తమిళనాడులోని వానియంబాడికి ఈ లారీ మామిడికాయల లోడుతో శనివారం రాత్రి బయల్దేరింది. ఈ లారీలో సుమారు 30 మంది వరకు ప్రయాణిస్తున్నారు. లారీ పెద్దవంక సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. ఘాట్రోడ్డు కావడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన 8 మందిలో అయిదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. లారీ లోయలో పడిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్లు తెలిసింది. మృతులందరూ తమిళనాడుకు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని దగ్గరలోని వానియంబాడి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఆరుగురిని వేలూరు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వివరాల గురించి తెలుసుకొని తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. బాధితులకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం ఆదేశాలతో రాత్రి పదిన్నర గంటలకు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరారు. వేలూరు కలెక్టర్, ఎస్పీలతో.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమన్వయం చేసుకుంటూ బాధితులను ఆదుకునేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సిఎం సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో కాగా డ్రైవర్ ఘాట్ రోడ్డులో మలుపు తిప్పడంలో లారీ పై నియంత్రణ కోల్పోవడంతో లారీ నేరుగా లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది.