వేలం: 27కిలోల గణపతి లడ్డూకు రూ.2,12,000(ఫొటో)
విశాఖపట్నం: ఆ వినాయకుడి లడ్డూ విశాఖపట్నం జిల్లాలోనే అత్యధిక వేలం ధరను పలికింది. గాజువాకలో వినాయకుడి వద్ద పెట్టిన 8 టన్నుల భారీ లడ్డూతో పోల్చితే చాలా తక్కవ.. అంటే 27కిలోల బరువే అయినప్పటికీ రూ. 2,12,000ల వేలం ధర పలికింది. స్టిబిఎల్ గేటుడ్ కమ్యూనిటీలకు చెందిన వారు, దువ్వాడ కాలనీకి చెందిన 15మంది కలిసి ఈ గణపతిని కొలువుదీర్చారు. ఆ మండపంలోని 27కిలోల లడ్డూకు వేలంపాట పాడారు.
జిల్లాలో ఇంత భారీ ధర పలికిన లడ్డూ ఇదే కావడం గమనార్హం. గతంలో కూడా ఈ లడ్డూకు భారీ వేలంపాటే పలికింది. నిరుడు పెట్టిన లడ్డూను రూ. 1,72,000లకు కెఎల్ గాంధీ, ఇంద్రసేనారెడ్డిలు కైవసం చేసుకున్నారు. ఆయన ప్రసాదం దక్కించుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందని వారు తెలిపారు. స్వామివారి ప్రసాదంతో తమకు మంచి జరిగిందని చెప్పారు.
తాము కొనుగోలు చేసిన ప్రసాదాన్ని బంధువులకు, స్థానికులకు పంచామని వారు తెలిపారు. దీంతో తమ వ్యాపారాలకు లాభాలు చేకూరాయని చెప్పారు.
కాగా, ఈ సారి 15మందితోపాటు జి మహేష్ అనే వ్యక్తి 27కిలోల భారీ లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయకుడు అంటే తనకు అమితమైన విశ్వాసమని మహేష్ తెలిపారు. ప్రసాదాన్ని తమ కుటుంబసభ్యులతోపాటు స్థానికులకు పంచుతామని తెలిపారు. వేలంపాటలో వచ్చిన సొమ్మును వచ్చే ఏడాది వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహకులు చెప్పారు.