8ఏళ్ల బాలికతో శ్రీవారి కల్యాణం: రాయదుర్గంలో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో గురువారం శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో 50ఏళ్ల ఆనవాయితీని కొనసాగిస్తూ ఓ బాలికతో శ్రీవారికి వివాహం జరిపించారు.
రాయదుర్గానికి చెందిన అరవా ప్రకాష్, యశోద దంపతుల కుమార్తె రేఖతో శ్రీవారి వివాహం జరిపించారు. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సాంప్రదాయం ఇక్కడి ఆలయంలో కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల బాలికలకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది వారి భక్తుల నమ్మకం.
తాజాగా నిర్వహించిన కల్యాణోత్సవంలో మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (రేఖ) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను పెళ్లికూతురిగా అలంకరించి కోటలోని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం సాంప్రదాయబద్దంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు, వేదపడింతుల ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.