ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ పేరు? ఫైనల్ గా పీవీ సింధు?
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. అధికారంలో ఉన్న వైసిపి జూనియర్ ఎన్టీఆర్ పై దృష్టిసారించింది అన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ వారసుడిగా , గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసి ఎన్టీఆర్ అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ఒకవేళ ఆఫర్ ఇచ్చినా తీసుకుంటారా ? అన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది. అసలు ఇంతకీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దామనుకున్న ఆఫర్ ఏంటి? ఎన్టీఆర్ పై ఎందుకు ఈ దుమారం లేచింది అంటే..
టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ , పీవీ సింధుల పేర్లు పరిశీలన
ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలనుకున్నారు . అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఈ రేసులో స్టార్ షట్లర్ పీవీ సింధు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను వైసిపి పాలనలో భాగస్వామ్యం చేయగలిగితే అటు చంద్రబాబుకు చెక్ పెట్టడమే కాకుండా, వైసిపికి అది ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది అని టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని మామ నార్నే శ్రీనివాసరావు, కొడాలి నాని ఇద్దరు జగన్ ముందు ప్రపోజల్ పెట్టారని సమాచారం. ఇక ఈ నేపధ్యంలోనే సీఎం జగన్ ఆయన పేరును పరిశీలిస్తున్నారు. అలాగే ఈ రేసులో అంతర్జాతీయ షట్లర్ పీవీ సింధు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది.
జగన్ ఆఫర్ ఇచ్చినా జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవటం కష్టమే .. ఎందుకంటే
అయితే మొదటి నుండి నరనరాన అన్ని విషయాలలో తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ని వదిలి వైసిపికి మద్దతిస్తారా.. అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి. అదే సమయంలో టీడీపీ పట్ల సుముఖతను, విముఖతను ప్రదర్శించటం లేదు జూనియర్ ఎన్టీఆర్ . ఇక ఈ నేపధ్యంలోనే వైసీపీ శ్రేణులలో జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పదవి ఇస్తే బాగుంటుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. గత ఎన్నికల సమయంలో కూడా టిడిపి కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేయలేదు. స్వయానా సోదరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె కోసం కూడా జూనియర్ పనిచేయలేదు. టిడిపిఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనా తనకేమీ పట్టనట్టుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారు. ఇవి వైసీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ పట్ల సానుకూలతను కలిగిస్తున్న అంశాలు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం పనిచేయలేదు అంటే అది పార్టీ పట్ల ఆయనకున్న విముఖత కాదు, చంద్రబాబు పట్ల ఆయనకున్న విముఖత అని టిడిపి వర్గాల్లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ సమయంలో ఒకవేళ జగన్ జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం ఇచ్చినా ఆయన కచ్చితంగా తీసుకోరు అనే టాక్ వినిపిస్తోంది.
త్వరలో టూరిజం బ్రాండ్ అంబాసిడర్ పేరు ప్రకటన చేసే ఛాన్స్ ... స్టార్ షట్లర్ పీవీ సింధు పేరు ఫైనల్ ?
ఇక మరోపక్క ఈ రేసులో అంతర్జాతీయ షట్లర్ గా ఘనవిజయాలు సాధించిన సింధు పేరును కూడా జగన్ సర్కార్ పరిశీలిస్తుంది. . సింధు ఎంపిక ద్వారా రాష్ట్రంలో యువతను ఆకట్టుకోవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. సిందు తన అసాధారణ విజయాలతో ఇప్పటికే రోల్ మోడల్ గా మారింది. అందుకే ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా పీవీ సింధు కే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సింధు విజయాలపై పాఠ్యాంశాలను కూడా రూపొందించేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధును నియమించడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ ఎక్కువగా పర్యాటకులను సైతం రాష్ట్రానికి రప్పించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.దాదాపు ఆమె పేరు ఖరారైనట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాన్ని ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది.