చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగుల
తాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు. తాడికొండలో షర్మిలా ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇది తాడికొండ కాదని అది వైసీపీ బంగారు కొండని అన్నారు. గల్లా జయదేవ్కు గుంటూరు ఓట్లు కావాలని పెట్టుబడులు ఏమో చిత్తూరుకు తరలిస్తారని విమర్శించారు. స్థానికేతరుడిని కాకుండా స్థానికులకే ఓట్లు వేసి గెలిపించాలని మోదుగుల కోరారు.
తనను పార్లమెంటుకు పంపిస్తే ప్రత్యేక హోదాపై పోరాడుతానని హామీ ఇచ్చారు. గల్లా జయదేవ్కు కనీసం గుంటూరు సరిహద్దులు తెలియవని ఎద్దేవా చేశారు. చిత్తూరు ఏందిరో వారి పీకుడేందిరో అంటూ ఛలోక్తులు విసిరారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇక లోకేష్ను పప్పూ అని సంబోధించారు మోదుగుల. అతనికి ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియదని... అలాంటి వారు అసెంబ్లీలో అవసరమా అని ప్రశ్నించారు. లోకేష్కు జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదని చెప్పిన మోదుగుల... మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మృతి చెందితే పరవశించి పోయాడనే దద్దమ్మ వ్యాఖ్యలు చేశాడని ధ్వజమెత్తారు మోదుగుల.
మాకు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు..మీకెవరున్నారు: ఉద్ధవ్ థాక్రే
ఇక వైయస్సార్ రాజ్యం రావాలంటే ప్రజలు వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాజధాని పేరుతో భూములను దోచేశారని చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు మోదుగుల. జగన్ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా మేలు చేస్తారని అన్నారు. ఇక అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీదేవిని ఆశీర్వదించాలని కోరారు మోదుగుల. శ్రీదేవి జగనన్న విసిరిన రాకెట్ అని చెప్పడంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. దళితులకు, ముస్లింలకు రాజన్న ఎంతో చేశారని... అంతకంటే ఎక్కువగానే జగన్ అధికారంలోకి వస్తే చేస్తారని చెప్పారు. స్థానికురాలైన శ్రీదేవి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని మోదుగుల చెప్పారు. ఆమె స్థానికంగా ఉండే హాస్పిటల్లోనే సేవలందిస్తారని చెప్పారు.