స్ట్రెచర్పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !
మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన తిక్కారెడ్డి నడవలేని స్థితిలో ఉండి కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్ట్రెచర్ పైన ఉండే ఆయన తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు బాసటగా ఆయన భార్య ఓటర్లను తన భర్తకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టిడిపి - వైసిపి వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ తిక్కారెడ్డి
తిక్కారెడ్డి ప్రస్తుత పరిస్థితి కారణం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని ఖగ్గలు గ్రామంలో టిడిపి - వైసిపి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ . ఘర్షణను ఆపాలని తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన లో తిక్కారెడ్డి తో పాటు ఏస్సైకి గాయాలయ్యాయి . దీంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు.
నామినేషన్ కూడా స్ట్రెచర్ పైన ఉండే వేసిన తిక్కారెడ్డి
మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ప్యాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్నారు. మొదట్లో సైకిల్ యాత్ర, ర్యాలీలు, సభల పేరుతో కొన్ని గ్రామాలు చుట్టేశారు. ఇలా మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లి అక్కడ జరిగిన ఘర్షణలో ఆయన గాయపడటం వల్ల కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది .అంగరక్షకులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయమై కుప్పకూలారు. చికిత్స చేయించుకొని ప్రత్యేక అంబులెన్స్లో స్ట్రెచర్పై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు .
ఎన్నికలప్రచారం స్ట్రెచర్ పైనుండే చేస్తున్న తిక్కారెడ్డి
కానీ.. ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో నడవలేని స్థితిలో ఉన్న ఆయన ఏకంగా స్ట్రెచర్పై పడుకుని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన కష్టాన్ని చూసి సానుభూతి ఓటు బ్యాంకుగా మారుతుందన్న భావన టీడీపీ నాయకుల్లో ఉంది. స్ట్రెచర్ పైనే ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన భార్య ఆయనకు గొడుగు పట్టుకుని తోడుగా నిలిచారు. భర్తకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. ఇదంతా చూస్తున్న ప్రజలు ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా అంటున్నారు .