నంద్యాలలో టీడీపీకి షాకే!: జగన్ పార్టీ ఫిర్యాదు, ఆ డీఎస్పీపై వేటు
కర్నూలు: ఉపఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో వాడీవేడి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో ఉప ఎన్నిక మరో నాలుగు రోజుల్లో జరగనుందనగా.. అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్లయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం డీఎస్పీ గోపాలకృష్ణపై బదిలీ వేటు వేసింది.
ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని ఆ పార్టీ నేతల నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది.

డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే గోపాలకృష్ణపై వేటు పడింది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ నిర్ణయం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించింది.