డేటా చోరీ: ఏపీలో పోలింగ్ నిర్వహణ: ఎన్నికల సంఘానికి పెను సవాల్
అమరావతి: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న అంశం డేటా చోరీ. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటూ వార్తలు రావడంతో ఈ విషయం రాజకీయ రంగును పులుముకొంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని నిజం చేస్తూ.. డేటా చోరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఓటర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ ఓటు ఉందో? లేదో? అనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ప్రకటించడం మరింత కీలకంగా మారింది. తమ ఓట్లు కనిపించట్లేదని, జాబితాలో పేర్లను చేర్చాలని కోరుతూ ఇప్పటికే 8 లక్షల 74 వేలకు పైగా దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందడం కలకలం రేపింది. దీనిపై అధ్యయనం చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
జాబితాలో పేర్లు లేకపోతే ఓటర్లు ఊరుకుంటారా?
ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని చెబుతోన్న వారి సంఖ్య 8 లక్షల 74 వేల పైమాటే. పోలింగ్ కు సరిగ్గా నెలరోజుల గడువు ఉంది. ఈ నెలరోజుల వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘం ఫారం 7ను దాఖలు చేసిన వారి పేర్లన్నింటినీ జాబితాలో చేర్చగలుగుతందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫారం 7ను దాఖలు చేసిన జిల్లాల్లో గుంటూరు టాప్ లో ఉంది. ఈ ఒక్క జిల్లాలో లక్షా 17 వేల వరకు దరఖాస్తులు అందాయి.
పరిశీలన కష్టమేనా?
లక్షల సంఖ్యలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించటం చాలా కష్టసాధ్యమనే అభిప్రాయం ఉంది. అర్హుల ఓట్లు గల్లంతై, అనర్హుల ఓట్లు జాబితాలో చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆందోళన ఉంది. తమ పేరు ఓటరు జాబితాలో లేకపోతే.. అర్హులైన వారు ఆందోళనలకు దిగే అవకాశాలు లేకపోలేదు. కొన్ని గ్రామాలు, మండల స్థాయిల్లో ఒకేసారి వేలల్లో ఓట్లను తొలగించిన ప్రభావం పోలింగ్ మీద పడుతుందని అంటున్నారు. బాధిత ఓటర్లందరూ ఒకేసారి ధర్నాలు, ఆందోళనలకు దిగితే..దాని ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేయడం కష్టమే.
నిజానికి- ఈ తరహా పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎన్నికల సంఘం చరిత్రలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ప్రజల డేటా చోరీ కావడం, దాని ఆధారంగా ఓటరు జాబితాలో నుంచి పేర్లను తొలగించిన సందర్భాలు గానీ, ఘటనలు గానీ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోనివే. దీనితో కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓటర్లు ఆందోళనకు దిగితే..
తమ పేర్లు కనిపించట్లేదంటూ ఓటర్లు ఆందోళనలకు దిగితే రీ పోలింగ్ చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తక మానదు. రీపోలింగ్ నిర్వహించడానికి సాధారణంగా 48 గంటల కంటే ఎక్కువ సమయాన్ని ఎన్నికల సంఘం తీసుకోదు. ఈ కాస్త వ్యవధిలో ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చడం సాధ్యమేనా? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎలాంటి పనితీరును కనపరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సంఘం ఏది చేసినా నెలరోజుల లోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తుది జాబితాలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా.. దాని ఫలితాలు దారుణంగా ఉంటాయి. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధమైన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.