ముగ్గురు పిల్లలుంటే అనర్హులే: మండలంలోనే ఓటరుగా: ఈసీ నిబంధనలు..!
ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. హైకోర్టులో దాఖలు అఫిడవిట్ ఆధారంగా షెడ్యూల్ ..ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించిన నిబంధనలు..విధి విధానాలు ఖరారు చేసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడో సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హలుగా నిర్ణయించింది. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలని తేల్చింది. అదే విధంగా మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు చెల్లించాల్సిన డిపాజిట్లను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
ముగ్గురు పిల్లలుంటే అనర్హత..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా.. పోటీ చేసే అభ్యర్ధులకు..ఎన్నికల నిర్వహణ పైనా నిబంధనలను సిద్దం చేసింది. అందులో భాగంగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే అనర్హత వేటు తప్పదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీని ప్రకారం 1995 మే 31 తర్వాత మూడో సంతానం కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలని తేల్చింది. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చుని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
డిపాజిట్లు ఫిక్స్..జిల్లా పరిధిలో..
అదే విధంగా..ఎన్నికల సంఘం అభ్యర్ధులకు కీలక సూచనలు చేసింది. జడ్పీటీసీగా పోటీ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాలి. అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి ఉండాలి. షెడ్యల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియజేస్తూ సర్టిఫికెట్ సమర్పించాలి.
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జడ్పీటీసీలు రూ.5 వేలు, ఎంపీటీసీలు రూ.2500లు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు ఎంపీటీసీ ఎన్నిక కోసం రూ.1250, జడ్పీటీసీ ఎన్నిక కోసం రూ.2500 చెల్లించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్ కేటాయించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది.