ఎన్నికల సంఘం కూడ జగన్ దారిలోనే..!! వైసీపి పై టీడిపి తీవ్ర ఆరోపణలు..!!
అమరావతి/హైదరాబాద్ : రాష్టంలో ప్రతిపక్ష వైసీపి చెప్పిందే అమలవుతోందని, జగన్ ఏలా చేబితే అలా ఎన్నికల సంఘం నడుచుకుంటోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను బదిలీ చేయాలని వైసీపి సూచించిందని తెలిపింది. శ్రీకాకుళంతో పాటు విజయనగరం, ప్రకాశం, చిత్తూరు ఎస్పీలపై చర్యలకు వైసీపి డిమాండ్ చేసిందని టీడిపి వెల్లడించింది.
వైకాపా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదు కాపీ.! బయట పెట్టిన టీడిపి..!!
ఈ మేరకు వైకాపా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఈ రోజు మీడియా కి తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఇదే కాకుండా అదనపు సీఈఓ సుజాత శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ యోగానంద్, లా అండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావులపైనా చర్యలు తీసుకోవాలని వైకాపా డిమాండ్ చేసిందని పేర్కొంది. బదిలీలకు సంబంధించిన ఈసీ ఆదేశాల కాపీని మీడియాకు అందజేసింది. వైకాపా చెప్పినట్లే ఈసీ చేస్తోందనడానికి ఇదొక సాక్ష్యం అని తెదేపా నేతలు ఆరోపించారు.
బదిలీలకు సంబంధించిన ఈసీ స్పందన..! ఆదేశాల కాపీని బహిర్గతం చేసిన తెలుగు తమ్ముళ్లు..!
ఇదిలా ఉండగా ఎన్నికల ముందు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎన్నికల సంఘాన్ని టీడీపీ నాయకులు చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇంటిలిజెన్స్ చీఫ్ సహా, ఇద్దరు ఎస్పీల బదిలీకి కారణమేంటని ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ కారణంతో బదిలీ చేశారో సమాధానం చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి పిటిషన్ ఆధారంగా బదిలీ చేస్తారా? అని నిలదీశారు.
ఈసీ పై బాబు ఘాటైన వ్యాఖ్యలు..! ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఎలా నడుచుకుంటారని ప్రశ్న..!!
ఈ మేరకు కర్నూలులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నేరలు చేసినట్టు అభియోగాలు ఉన్న విజయసాయిరెడ్డి పిటిషన్ను ఆధారంగా తీసుకుని ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తారా? ఏ కారణంగా లేకుండా అధికారులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భాజపా, వైకాపా, కేసీఆర్ ఆడిన నాటకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎన్నికలకు సంబంధం లేని అధికారులను ఎలా బదిలీ చేస్తారు? ఎన్నికల అఫిడవిట్లోనే వాళ్ల నేరాలపై ప్రస్తావించారు. నేరాలున్న వారు ఫిర్యాదు చేస్తే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని బాబు ప్రశ్నించారు.
ఓట్ల తొలంగింపుపై ఫిర్యాదు చేస్తే ఈసి స్పందించలేదన్న బాబు..! ఏకపక్ష దోరణి వద్దన్న బాబు..!!
ఓట్ల దొంగలు పట్టుబడిన తర్వాత ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని వైకాపా అరాచకాలు చేయాలని చూస్తోంది. వివేకా హత్య.. వాళ్ల ఇంట్లో జరిగితే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. హత్యకేసు విచారణ జరుగుతుంటే అధికారిని ఎలా బదిలీ చేస్తారని చంద్ర బాబు నిలదీసారు? కులాలు, మతాలు పేరుతో ఫిర్యాదు చేస్తే బదిలీ చేస్తారా? ఆగమేఘాలపై బదిలీలలపై నిర్ణయం తీసుకుంటారు గానీ.. దొంగ ఓట్లపై నిర్ణయం తీసుకోరా? ఫారం-7 దరఖాస్తులు దుర్వినియోగం చేస్తున్నారని పట్టిస్తే చర్యలు తీసుకోరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.