ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: ఏపీలో మూడు ఎమ్మెల్సీలు...వైసీపీ నుండి ఆ ముగ్గురికి ఖరారు..!
ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు..తెలంగాణలో ఒక్క స్థానం కోసం ఎన్నిక జరగనుంది. తెలంగాణలో ఎమ్మెల్సీగా ఉంటూ అనర్హత వేటుకు గురైన యాదవ రెడ్డి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించనున్నారు. అదే విధంగా ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉంటూ తాజాగా జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. దీంతో..వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. దీంతో..ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాలె ఎమ్మెల్యే కోటాలోనే జరిగనుండంతో..ఆ మూడు స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన వారికి ఇప్పుడు ఛాన్స్ దక్కనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ..తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మూడు స్థానాలు.. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఈ మధ్య కాలంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్సీ కె యాదవ రెడ్డి స్థానంలో కొత్త వారి ఎన్నికోనున్నారు. ఇది ఎమ్మెల్యే కోటాలో జరగనుంది. అదే విధంగా ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలు తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవటంతో వారు తమ ఎమ్మెల్సీ పదవుకు రాజీనామా చేసారు. దీంతో..ఆ ముగ్గురి స్థానంలో మరో ముగ్గురు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు కానున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి కరణం బలరామకృష్ణ మూర్తి.. వైసీపీ నుండి ఆళ్ల నాని.. కొలగట్ల వీరభద్ర స్వామి శాసనసభకు ఎన్నికై తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు రాజీనామా చేసారు. దీంతో..ఎమ్మెల్యే కోటాలో తిరిగి తెలంగాణలో ఒక స్థానం..ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.
ఆగస్టు 26న ఎన్నికలు..
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 19వ తేదీ నామినేషన్ల ఉప సంహణకు తుది గడువు. ఆగస్టు 26న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రకటించిన ఖాళీల మేరకు తెలంగాణలోని యాదవరెడ్డికి 2021 మార్చి 3వ తేదీ వరకు గడువు ఉంది. ఈ స్థానంలో ఎన్నికయ్యే ఎమ్మెస్సీ అప్పటి వరకే పదవిలో ఉంటారు. ఇక, ఏపీలో కొలగొట్ల వీరభద్ర స్వామి స్థానంలో ఎన్నిక అయ్యే ఎమ్మెల్సీ పదవీ కాలం సైతం 2021 మార్చి 29 వరకు ఉంటుంది. అదే విధంగా కరణం బలరాం.. ఆళ్ల నాని స్థానంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు మాత్రం గడువు 2023 మార్చి 29 వరకు ఉంటుంది. దీంతో.. ఈ రెండు స్థానాల్లో భర్తీ అయ్యేందుకు ఔత్సాహికులు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ నుండి ఆ ముగ్గురికీ ఖరారు..
ఏపీ నుండి ముగ్గురు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నికలు కావటంతో అధికార పార్టీకి 151 మంది శాసనసభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది సభ్యుల సంఖ్యా బలం మాత్రమే ఉంది. దీంతో..మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, వైసీపీ నుండి కొత్తగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకొనే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. తాజా ఎన్నికల్లో రేపల్లె నుండి ఓడిపోయినా.. మంత్రి పదవి దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణకు ఒక స్థానం ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ముస్లిం మైనార్టీ కోటాలో సినీ హీరో బాలకృష్ణ మీద పోటీ చేసి హిందూపూర్ నుండి ఓడిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రంజాన్ విందు సందర్భంగా జగన్ ప్రకటించారు. ఇక, మరో ఎమ్మెల్సీ కాపు కోటాలో ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చీరాల నుండి పోటీ చేసి ఓడిన ఆమంచి కృష్ణ మోహన్ లేదా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దక్కే అవకాశం ఉంది.