మూడు ఎమ్మెల్సీలు వైసీపీకే: ఇద్దరికి ఇప్పటికే ఖరారు: ఆ మూడో సీటు ఎవరికి..జగన్ మదిలో..!
ఏపీ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే శాసనసభ లో 151 సీట్ల భారీ ఆధిక్యం వైసీపీకి ఉన్నా..శాసన మండలిలో మాత్రం టీడీపీ అధిక్యతే కొనసాగుతోంది. సభలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా..టీడీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 34గా ఉంది. ఇక..ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఎన్నికలు జరగాల్సిన మూడు స్థానాలు ఇప్పుడు అధికారంల ఉన్న వైసీపీకే దక్కనున్నాయి. ఈ మూడు స్థానాల్లో ఇప్పటికే రెండు ఎవరికి ఇస్తారనే దాని పైన స్పష్టత వచ్చేసింది. ఇక, మిగిలిన మరో స్థానం ముఖ్యమంత్రి జగన్ ఎవరికి ఇస్తారనేది ఇప్పడు వైసీపీలో హాట్ టాపిక్.
ఆ ముగ్గురి స్థానంలో..కొత్తగా మరో ముగ్గురు..
ఏపీలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఉంటూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ముగ్గురు గెలవటంతో ఈ ఎన్నికలు అనివార్యంగా మారాయి. టీడీపీ నుండి చీరాల నుండి గెలిచిన కరణం బలరామ కృష్ణ మూర్గి, వైసీపీ నుండి ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, విజయనగరం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా నెగ్గిన కొలగొట్ల వీరభద్ర స్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. దీంతో..ఎమ్మెల్యే కోటాలో మరో ముగ్గురిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ శాసనసభలో వైసీపీ సంఖ్యా బలం 151గా ఉండం..టీడీపీకి కేవలం 23 మందే ఉండటంతో ఈ మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. దీని ద్వారా ఇప్పటి వరకు మండలిలో టీడీపీ బలం అధికార పార్టీ కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 58 ఎమ్మెల్సీల్లో టీడీపీ నుండి ప్రస్తుతం 34 మంది ఉన్నారు. ఇక శాసనమండలిలోనూ క్రమేణా వైసీపీ సంఖ్య బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆ రెండు స్థానాల్లో భర్తీ కోసం పోటీ..
ఖాళీ నోటిఫై చేసిన మూడు స్థానాలను వైసీపీ దక్కించుకోవటం ఖాయమే. అయితే, ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతూ రాజీనామా చేసిన వారి స్థానంలో జరుగుతున్న ఎన్నికలు కావటంతో..వారికి మిగిలి ఉన్న కాల పరిమితి మాత్రమే కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు వర్తిస్తుంది. అందులో భాగంగా.. ఏపీలో కొలగొట్ల వీరభద్ర స్వామి స్థానంలో ఎన్నిక అయ్యే ఎమ్మె ల్సీ పదవీ కాలం సైతం 2021 మార్చి 29 వరకు ఉంటుంది. అదే విధంగా కరణం బలరాం.. ఆళ్ల నాని స్థానంలో ఎమ్మె ల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు మాత్రం గడువు 2023 మార్చి 29 వరకు ఉంటుంది. దీంతో.. ఈ రెండు స్థానాల్లో భర్తీ అయ్యేందుకు ఔత్సాహికులు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఆ రెండు స్థానాలు ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎవరికి ఖరారు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నుండి ఇద్దరు ఖరారు..ఆ మూడో వ్యక్తి ఎవరంటే..
తాజా ఎన్నికల్లో రేపల్లె నుండి ఓడిపోయినా.. మంత్రి పదవి దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణకు ఒక స్థానం ఖాయంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ముస్లిం మైనార్టీ కోటాలో సినీ హీరో బాలకృష్ణ మీద పోటీ చేసి హిందూ పూర్ నుండి ఓడిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా జగన్ ప్రకటించారు. ఇక, మరో ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది జగన్ గతంలో హామీ ఇచ్చిన వారిలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా జగన్ సన్నిహితుడు..గతంలో రాజంపేట సీటు మేడా మల్లిఖార్జున రెడ్డి కోసం త్యాగం చేసిన మేకేపాటి అమర్నాధ రెడ్డి ప్రముఖంగా పోటీలో ఉన్నారు. వీరితో పాటుగా భవిష్యత్ రాజకీయ సమీకరణాలలో భాగంగా కాపు కోటా లో తాజా ఎన్నికల్లో ఓడిన ఆమంచి కృష్ణమోహన్ పేరు రేసులో ఉంది. జగన్ జెరూసెలం నుండి వచ్చిన తరువాత ఈ మూడు పేర్లలో ఒకటి ఖరారు చేసే అవకాశం ఉంది.