ఎవరి పాపం ? ఎవరికి శాపం ? ఏపీ ఎన్నికల సిబ్బంది పై వేలాడుతున్న కత్తి..!
ఏపిలో ఎన్నికల విధుల నిర్వహణలో అలసల్వం వహించిన అధికారుల పైన చర్యలకు రంగం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్న ఘటనలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లను నివేదికలు కోరారు. వాటి ఆధారంగా చర్యలకు రంగం సిద్దం చేసారు. అదే విధంగా కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూంల విషయంలోనూ సీఈఓ మార్గ దర్శకాలు జారీ చేసారు.
అధికారుల పై చర్యలు తప్పువు..
ఏపిలో జరిగిన ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధల నిర్వహణ లో విఫలమైన అధికారుల పై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. పోలింగ్ సమయంలో నెల్లూరు..కృష్ణా..విశాఖ జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో చోటు చేసుకున్న అవకతవకల పైన సంబందిత ఎన్నికల సిబ్బందిపై వేటు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్కడ చోటు చేసుకున్న ఘటనల పై ఆ మూడు జిల్లాల కలెక్టర్ల నుండి నివేదిక కోరిగా, ఆ రిపోర్టులు సీఈఓ కు చేరాయి. అదే విధంగా పోలింగ్ తరువాత తలెత్తిన వివాదాల్లో ఆర్వో..ఏఆర్వోలపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపి ఎన్నికల ప్రధానాధికారి సిఫార్సు చేసారు.
ఈవీయంల విషయంలో కఠినంగా ఉంటాం..
ఇక, ఇప్పుడు కీలకమైన ఈవీయంల భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ద్వివేది హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని ద్వివేది చెప్పుకొచ్చారు.
ప్రతీ అంశంలోనూ నిశితంగా పరిశీలన..
ఏపిలో ఎన్నికల నిర్వహణ పై రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో ఈసీ సైతం సీరియస్ గానే ఉంది. ఎక్కడా ఎవరికి విమర్శలకు అవకాశం లేకుండా ప్రతీ అంశంలోనూ సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కోసం జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో సిఫార్సు చేసారు. దీని పై ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదు. ఇక, స్టోర్ రూంల విషయంలోనూ ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో వీటికి సంబంధించి సీఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టోర్ రూంలను తెరిచే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.