గుంటూరు పోరు: బాబు, జగన్ పార్టీల హోరాహోరీ!
గుంటూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో గుంటూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనేది కాదనలేని వాస్తవం. దీంతో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు దూరమైన నేపథ్యంలో జిల్లాలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది.
జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిందనే చెప్పాలి. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టిడిపికి వలసబాట పట్టారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేశ్ లాంటి యువ నాయకులు టిడిపిలో చేరడం కాంగ్రెస్ పార్టీకి కొంతమేర నష్టంగానే చెప్పుకోవచ్చు.
జిల్లా పరిధిలో మూడు పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా, పొత్తులో భాగంగా నరసరావుపేట స్థానాన్ని బిజెపికి కేటాయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన టిడిపి సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి కొంతమేర నీరసించినట్లు కన్పిస్తోంది. టిక్కెట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గుంటూరు పార్లమెంట్ స్థానానికి టిడిపి అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ రెబల్గా నామినేషన్ వేశారు. జిల్లాలోని 17అసెంబ్లీ స్థానాల్లో ఏడుచోట్ల రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించడం నాయకత్వానికి శిరోభారంగా మారింది. గుంటూరు పశ్చిమ, తూర్పు, ప్రత్తిపాడు, మాచర్ల, మంగళగిరి, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచి పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
దీంతో పార్లమెంట్ అభ్యర్థులు, కొత్తగా టిక్కెట్లు పొందినవారు, సీనియర్ నేతలను ఆయా నియోజకవర్గాలకు పంపి రెబల్స్ను తప్పించేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రెబల్స్ను బుజ్జగించడంతో కొంత సఫలమైనా.. మరికొందరు బరిలోనే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. కాగా, జగన్ పార్టీకి రెబల్ బెడద లేనట్లుగానే తెలుస్తోంది. ఇక జిల్లాలో దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం గుంటూరు పశ్చిమ, తెనాలిలో మాత్రమే గెలుపుపై ఆశలు పెట్టకుంది. మిగిలినచోట్ల పరువు పోకుండా నామినేషన్ మాత్రం వేసిన అభ్యర్థులు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ గెలుపు కోసం తమవంతు కృషి చేసుకుంటున్నారు.