ప్రతి ఇంటికీ మేనిఫెస్టో: ఎవరైనా కోర్టుకెళ్తారేమో: జగన్ సెటైర్: ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కాపీలను రాష్ట్రంలోి ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన మేనిఫెస్టో కాపీలను అందజేస్తామని తెలిపారు. గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్ల ద్వారా ఎన్నికల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేస్తామని, దీనికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోతో ప్రయోగం..
అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా వైఎస్ జగన్ వివిధ విభాగాలు, ప్రాజెక్టులవారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. మన పాలన-మీ సూచన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఎంపిక చేసిన కొందరు లబ్దిదారులు.. ఆయా శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు లబ్దిదారులతో నేరుగా సంభాషించారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము పవిత్ర గ్రంధంగా భావిస్తున్నామనే విషయాన్ని వైఎస్ జగన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.
పవిత్ర గ్రంథంలా..
నిండు అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. తమ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఎన్నికల మేనిఫెస్టోను ఓ భగవద్గీతగా, ఓ ఖురాన్, బైబిల్లా భావిస్తుంటామని జగన్ చెప్పుకొచ్చారు. మరోసారి ఆయన అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది? తాము అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయా? లేదా? అనే విషయానికి మేనిఫెస్టో దిశానిర్దేశం చేస్తోందని అన్నారు.
మరో వినూత్న ప్రక్రియకు
మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా ఓ సర్వే ప్రారంభించబోతోంది. ఈ నెల 30వ తేదీన ఈ సర్వే చేపడుతారు. ప్రతి ఇంటికీ పంపిణీ చేసే మేనిఫెస్టో కాపీల్లో పొందుపరిచిన అంశాలపై లబ్దిదారులు టిక్ చేస్తే సరిపోతుంది.ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తోన్న అన్ని సంక్షేమ పథకాల పేర్లు, వాటి లబ్దిదారుల వివరాలు, ఎంతమంది లబ్దిపొందుతున్నారనే విషయాన్ని వలంటీర్లు అందజేసిన ఈ మేనిఫెస్టో కాపీల్లో ముద్రిస్తారు. ఆయా సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయా? లేదా? అనే విషయంపై టిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ కాపీల ఆధారంగా..
లబ్దిదారులు ఇలా టిక్ చేసిన మేనిఫెస్టో కాపీలను మళ్లీ వలంటీర్లకు అందజేయాల్సి ఉంటుంది. అవన్నీ మళ్లీ ప్రభుత్వానికి చేరుతాయి. ఇందులో లబ్దిదారులు మార్క్ చేసిన టిక్లకు అనుగుణంగా ప్రభుత్వం తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి నేరుగా లబ్దిదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకునేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని అంటున్నారు. ఫలానా పథకం తమకు అందలేదంటూ లబ్దిదారులు ప్రతికూలంగా మార్క్ చేస్తే.. దానికి గల కారణాలను ఆరా తీస్తుంది ప్రభుత్వం.
మహిళలు బాగుంటేనే..
భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తామని వైఎస్ జగన్ అన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందనే విషయాన్ని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని చెప్పారు. మహిళలను ముందుండి నడిపించడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ప్రతి పథకాన్ని కూడా మహిళల కోసం ఉద్దేశించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామనీ చెప్పారు.
ఎవరైనా కోర్టుకెళ్తారేమో..
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును దృష్టిలో ఉంచుకుని ఓ సెటైర్ వేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా.. నామినేషన్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ను కల్పించామని అన్నారు. ఈ రిజర్వేషన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తామని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధిని కల్పించాలనే ఉద్దేశంతోనే తాము ఈ రిజర్వేషన్లను ప్రవేశపెట్టామని అన్నారు. మహిళలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లను కల్పించాలని ఉందని అన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తారేమోననే ఉద్దేశంతో 50 శాతం వద్దే ఆగిపోయామని చెప్పారు.