స్థానిక సంస్థల ఎన్నికలు ... జగన్ నిర్ణయంతో వైసీపీ నేతల్లో టెన్షన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు , స్థానికంగా చక్రం తిప్పే నాయకులు తమ వారికి టికెట్లు రాకుంటే తమ పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ లో ఉన్నారు . ఇక ఇంతకీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఏమిటి ? వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఎందుకు ? అంటే ...
అధికారులకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ... ఆ విషయంలో చిన్న తప్పు కూడా జరగొద్దు
స్థానిక సమరానికి రెడీ అవుతున్న వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్న జగన్ పార్టీ విషయంలో కూడా కీలక నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే పార్టీలోని నాయకులకు మింగుడు పడటం లేదు . వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవ్వటంతో పాటు అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు.
అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ నిర్ణయం
అయితే మీరంతా అభ్యర్థుల విషయంలో కష్టపాడాల్సింది ఏమీ లేదు. అంతా పార్టీనే చూసుకుంటుంది అని జగన్ చెప్పటం నాయకులకు అసలు రుచించటం లేదు . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో ఆ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని , గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీయే సుప్రీం అని తెగేసి చెప్పటంతో పార్టీ నేతల గొంతుల్లో వెలక్కాయ పడినట్లయ్యింది .
సర్వే ద్వారానే అభ్యర్థుల ఎంపిక చేస్తామన్న జగన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో , గెలుపు గుర్రాలెవరో తమకు తెలుసనీ , అభ్యర్థుల ఎంపికపై గ్రౌండ్ లెవల్లో ప్రజాబలం కలిగిన నేతలెవరో సర్వే ద్వారా సెలెక్ట్ చేస్తామని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు దగ్గరగా ఉండే నేతలు, అనుయాయులు, అనుకూలంగా ఉండే వారికి పార్టీ తరపున టికెట్ ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు ప్రయత్నిస్తుంటారు. ఎక్కువశాతం తమ కోసం పని చేసిన వారికే పోటీ చేసే అవకాశాలు కూడా వచ్చేలా చూస్తారు.
టెన్షన్ పడుతున్న ముఖ్య నేతలు ..
తమ గ్రూపు వారికి, తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నించటం సర్వ సాధారణం .అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యనాయకులు తమ వారికి టికెట్లు రావేమో అని టెన్షన్ పడుతున్నారు. తమకు స్థానిక ఎన్నికల టికెట్లు కూడా నిర్ణయించే పరిస్థితి లేకుంటే స్థానికంగా తమకు ఏం గుర్తింపు ఉంటుందని వారు లోలోపల మదనపడుతున్నారు. ఇక కొందరు అసలు పార్టీ అధినాయకత్వం నిర్వహించిన సర్వేలో ఎవరికి మొగ్గు ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్వే ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న ప్రకటన సొంత పార్టీ నేతలను నిదురపోనివ్వటం లేదని తెలుస్తుంది.