తెలంగాణలో నోటిఫికేషన్: టిడిపి అభ్యర్థి నామినేషన్
హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం ఉదయం విడుదలైంది. తెలంగాణ ప్రాంతంలోని 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు (బుధవారం) ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నామినేషన్ల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నోటిఫికేషన్ విడుదలైంది. 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10వ తేదీన స్క్రూటిని ఉంటుంది. 12వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు.
నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థికి పదివేల రూపాయలు, ఎంపీ అభ్యర్థికి 25వేల రూపాయలు. తెలంగాణ ప్రాంతంలో 2.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పది జిల్లాల్లో 29,138 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు కాగా, ఎంపి అభ్యర్థి ఖర్చు రూ.70 లక్షలుగా ఉంది.
తెలంగాణవ్యాప్తంగా ఏప్రిల్ 30న 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 7 నుంచి ఈసి ఓటు పత్రాలను పంపిణీ చేయనుంది. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో... బాన్సువాడ టిడిపి అభ్యర్థిగా బాద్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.