ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఇంత స్తబ్తుగా ఉంటే ఎలా..?మంత్రులపై మండిపడ్డ బాబు..!!
అమరావతి : ఏపి మంత్రి వర్గ సమావేశం తర్వాత మంత్రులకు క్లాస్ పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాజకీయంగా చురుకైన పాత్ర పోషించకపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసిన తరువాత ఆయన సుమారు గంటన్నర పాటు మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్ధితులపై సుదీర్ఘ చర్చ జరిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా సీయం చంద్రబాబు మంత్రుల రాజకీయ స్పందనల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ విషయానికైనా, ఎవరికైనా నేనొక్కడినే సమాధానం చెడుతున్నానని, మంత్రి వర్గంలోని ఒక్కళ్లు కూడా పట్టించుకోవడం లేదని మంత్రులపై మండిపడ్డారు. మంత్రులగా ఉండి సీరియస్ నెస్ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల మంత్రులు ఎప్పటికప్పుడు స్పందించాలని, మీలో ఏ ఒక్కరూ సరిగా స్పందించడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శకు మంత్రులందరూ ధీటుగా కౌంటర్లు ఇవ్వాలని సీయం చంద్రబాబు సహచరులకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంతటి నిశ్వబ్దం మంచిది కాదని చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేసారు.