తెలుగు హీరోలకు అగ్ని పరీక్షలా మారిన ఎన్నికలు..! ఎవరు ఏ గట్టున ఉండబోతున్నారు..??
అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ రాకతో ఆ బంధం మరింత మరింత ద్రుఢపడింది. నాటితరం నటీనటుల్లో కొంగర జగ్గయ్య, రామానాయుడు, జమున, కృష్ణ, చిరంజీవి, హరికృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నటీనటులు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల మద్దతుతో నెగ్గారు. పదవులు చేపట్టారు. మరి 2019లో ఏ హీరో.. ఎటువైపు ప్రచారం చేస్తారనేది ఉత్కంఠతగా మారింది. ఎందుకంటే.. అన్నిపార్టీలతో సినీ నటులకు బంధుత్వం ఉంది. పైగా.. ఏపీలో జరిగేది ప్రతిష్ఠాత్మక ఎన్నికలు.. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ.. పవర్స్టార్ పవన్ సారథ్యంలో జనసేన.. యువ నేత జగన్ వైసీపీ నుంచి ఆధినాయకత్వం వహిస్తున్నారు. ఈ మూడు పార్టీలకు సినీ పరిశ్రమతో చాలా వరకూ సత్సంబంధాలు ఉన్నాయి.
తెలుగు హీరోలకు ఎన్నికల దెబ్బ..! ఔనంటే ఒక బాధ.. కాదంటే ఒక బాధ..!!
ముగ్గురు అధినేతలకూ సినిమా పరిశ్రమతో, నటీ నటులతో అనుబంధం ఉంది. పైగా.. టీడీపీలో సూపర్స్టార్ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా బరిలో ఉన్నారు. లోకేష్బాబు మంగళగిరి నుంచి పోటీపడుతున్నారు. స్వయానా బాలయ్య బాబు అల్లుడు కూడా. వాణీవిశ్వనాథ్, దివ్యవాణి వంటి తారాగణం ఇప్పటికే మీడియా ఎదుట ఘాటైన ప్రసంగాలు వినిపిస్తున్నారు. పవన్కళ్యాణ్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడటాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు బాబాయి మద్దతు ప్రకటించాడు రామచరణ్తేజ్. ఇకపోతే.. రాజారవీంద్ర, ఆలీ, దాసరి అరుణ్కుమార్ వంటి నటులు వైసీపీకు మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు.
అన్ని పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకమే..! మరి హీరోల హరోయిజమ్ ఎటువైపు..?
పవన్ వైపు తాము ఉన్నామంటూ.. చోటానటులు చెప్పటం మినహా బయటకు వచ్చిన ఆనవాళ్లు కనిపించట్లేదు. ఇప్పుడు ప్రచారంలో ఎవరి తరపున ఏ హీరో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తారనేది ఆసక్దిగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అక్క సుహాసిని తరపున కూకట్పల్లిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ప్రచారం జరిగినా చివర్లో సారీ చెప్పారు. షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ.. అక్కకు ట్విట్టర్ ద్వారా మద్దతు చెప్పాడు. అటువంటి జూనియర్ చెల్లి బ్రాహ్మణి కోసం టీడీపీ తరపున ప్రచారం చేస్తారా! మామ కోసం వైసీపీ వైపు దిగుతారా అనేది కూడా ఉత్కంఠగా మారింది.
రైతులకు 5 వేల ఫించను : పిజీ వరకు ఉచిత విద్య : ఎన్నికల వరాలు ప్రకటించిన పవన్..!
మహేష్ బాబు పై అందరి ద్రుష్టి..! బావకు సై అంటూ కాంగ్రెస్ ను దూషిస్తారా...?
రాజకీయాలంటే ఆమడదూరం ఉండే మహేశ్బాబు మరి బావ కోసం గుంటూరు వస్తారా.. తన తండ్రి అభిమానించే కాంగ్రెస్ను తిట్టిపోస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక మెగా స్టార్ చిరంజీవి పేరుకు కాంగ్రెస్లో ఉన్నా.. సైరా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాను ఏ పార్టీకు చెందిన వాడిని కాదంటూ.. అందరివాడుగా సినీ కార్యక్రమాల్లో పెద్దరికంగా హాజరవుతున్నారు. బాహుబలి ప్రభాస్ సొంత బాబాయి కృష్ణంరాజు బీజేపీలో ఉన్నారు. మరి ఆయన కూడా కాషాయనాథుల కోసం బీజేపీ తరుపున ప్రచారం చేస్తారా అనే అంశం ఆసక్తిగా మారింది. దీంతో టాప్హీరోలకు ఇది పరీక్షా కాలంగా పరిణమించింది. ఏ పార్టీ పిలిచినా ఎలా స్పందించాలని ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రచారం తర్వాత మళ్లీ సినిమాలే..! హీరోల ప్రచారం ద్వారా ఎవరికి ఫ్లాప్..? ఎవరికి క్టాప్..?
నెలరోజుల తరువాత మళ్లీ ముఖానికి రంగులు వేసుకోవాల్సిందే. ఫ్యాన్స్ను మెప్పించాల్సిందే. అటువంటిది రాజకీయంగా వారి ప్రసంగాలు అభిమానులను ఇబ్బంది కలిగిస్తే, బావోద్వేగానికి గురవుతారు. మీ సినిమా మీ పార్టీ వాళ్లనే చూడమనే అభిప్రాయానికి వస్తే పరిశ్రమకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల కొందరు కుర్ర హీరోలు, అగ్రకథానాయకుల సినిమాలు ఇలాగే బోల్తాకొట్టిన సంగతి తెలిసిందే. అందుకే.. తెలుగు హీరోలు.. రాజకీయం కన్నా.. కెరీర్కే ప్రాధాన్యతనిస్తున్నారు. వెండితెరకే జై కొడుతున్నారు. కానీ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన 2019 ఎన్నికల్లో తెలుగు హీరోల పాత్ర ఏంటన్న అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది.