కిరణ్ రెడ్డి పట్టు: సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఎన్నికలు?
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఎంత తొందరపడినా వచ్చే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్నికలనాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడం సాధ్యం కాదని హోం శాఖ వర్గాలు అంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి ముసాయిదా బిల్లుపై చర్చించి, తిరిగి పంపించడానికి 40 రోజుల గడువు అడగడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాల ఏర్పాటు సమయంలో శాసనసభ అభిప్రాయం తెలియజేయడానికి ఇచ్చినంత గడువు తమకు ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయాన్ని తనకు చేరవేయడానికి వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి హుటాహుటిన ప్రత్యేక యుద్ధ విమానంలో వచ్చినా, ఇప్పటికే శాసనసభలో ప్రతిపాదించినా జాప్యం చేసే విధంగానే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ శాసనసభా సమావేశాల్లో చర్చకు తీసుకోకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అయితే, గడువు వరకు లాగడానికి అవసరమైన వ్యూహాన్ని మాత్రం అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపు బుధవారం శాసనసభలో చర్చ ప్రారంభమవుతుంది. శుక్రవారం వరకు చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మరో రెండు విడతలు శాసనసభలో చర్చే జరిగే అవకాశం ఉంది. క్రిస్మస్, సంవత్సరాది సెలవుల తర్వాత తిరిగి జనవరి 3వ తేదీన సమావేశాలను ప్రారంభించింది 10వ తేదీ వరకు చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత సంక్రాంతి సెలవులు వస్తాయి. సంక్రాంతి సెలవుల తర్వాత జనవరి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరిపే అవకాశం ఉంది. చర్చ త్వరగా ముగించడానికి తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు ప్రయత్నించినా ఫలించే అవకాశాలు లేవని అంటున్నారు.
ఆ తర్వాత నివేదికను రూపొందించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాష్ట్రపతికి జనవరి 25వ తేదీనాటికి పంపిస్తారు. ఆ తర్వాతి వ్యవహారాలు పూర్తయి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసినా వచ్చే ఎన్నికల్లోగా రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడం సాధ్యం కాదని అంటున్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంటు బిల్లును ఆమోదించినా ఎన్నికల లోపు సాంకేతికంగా ఏర్పడే అవకాశాలు లేవని అంటున్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫికేషన్కు నెల రోజులు, గెజిట్లో ప్రచురణకు రెండు నెలలు పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్, చత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు విషయాల్లో ఇలాగే జరిగింది.
కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్చి 2వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జూన్ నాటికి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఎన్నికల షెడ్యూల్ను చూస్తే సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు ఎన్నికల లోపు ఏర్పడే అవకాశాలు లేవని అంటున్నారు. అందువల్ల సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.