ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చ
ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ సెంటిమెంట్లు అధికార పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఏపిలోని ఆ నియోజవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే..ఇక ఆ పార్టీ తరువాతి ఎన్నికల్లో అధికారంలోకి రాదు. గత చరిత్ర ఇదే స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు టిడిపి నేతలు ఆ నియోజకవర్గం పై ఆరా తీస్తున్నారు..
వేమూరు నుండి మంత్రి అయితే...
గుంటూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వేమూరు. ఎందరో ప్రముఖులు ఈ నియోజవర్గం నుండి గెలుపొందారు. తొలి నుండి ఇక్కడ ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. 2009 లో వేమూరు ఎస్సీ రిజర్వ్ అయింది. ఇక్కడ నుండి యడ్లపాటి వెంకటరావు మూడుసార్లు, కల్లూరు చంద్రమౌళి-ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండు సార్లు గెలుపొందారు. రామస్వామి చౌదరి, ఆలపాటి ధర్మారావు, నాదెండ్ల భాస్కరరావు, సతీష్ పాల్ రాజ్ , కె వీరయ్య ఒక్కోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, 2009, 2014 లో ప్రస్తుత మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నుండి గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నవారు మంత్రిగా పదోన్నతి పొందితే..ఆ తరువాతి ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాదనే వాదన ఉంది. ప్రస్తుతం వేమూరు ఎమ్మెల్యే మంత్రిగా ఉండటంతో..ఇప్పుడు ఈ చర్చ ఇప్పుడు ఎన్నికల పోలింగ్ తరువాత మరో సారి తెర మీదకు వచ్చింది.
గతం చెప్పిన సత్యాలు..
ఈ వేమూరు నియోజకవర్గం నుండి తొలుత టిడిపి నుండి గెలిచిన నాదెండ్ల భాస్కరరావు ఆ తరువాత ఎన్టీఆర్ ప్రభుత్వం పైన తిరుగుబాటుకు కారణమయ్యారు. ఆ తరువాత అధికారానికి దూరమయ్యారు. 1989 లో కాంగ్రెస్ నుండి సీనియర్ నేత ఆలపాటి ధర్మారావు పోటి చేసి..టిడిపి అభ్యర్ధి యడ్లపాటి వెంకటరావు పై గెలిచారు. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం శాఖ మంత్రి గా పని చేసారు. ఆ తరువాత జరిగిన 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలయింది. ఇక, 1994, 1999 లో టిడిపి ఎమ్మెల్యేగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. 1999 లో రెండో సారి గెలవటంతో..నాటి టిడిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత 2004 లో టిడిపి అధికారం కోల్పోయింది. ఇక, ఇప్పుడు వరుసగా రెండు సార్లు ఎ మ్మెల్యేగా గెలిచిన నక్కా ఆనందబాబు ప్రస్తుతం టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. దీంతో..ఇప్పుడు గత చరిత్ర పునరావృతం అవుతుందా లేక కొత్త చరిత్ర నమోదవుతుందా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హోరా హోరీ పోరులో విజేత ఎవరు..
వేమూరు నియోజవర్గంలో టిడిపి..వైసిపి మధ్య ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు నడిచినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్దులే గత ఎన్నికల్లోనూ పోటీ పడ్డారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్ది నక్కా ఆనందబాబు ..వైసిపి అభ్యర్ధి మేరుగ నాగార్జున పై 2127 ఓట్ల అధిక్యంతో గెలిచారు. 2014 లో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత జిల్లా నుండి క్యాబినెట్ లో స్థానం దక్కించుకున్న రావెల కిషోర్బాబు ను తొలిగించటంతో..నక్కా ఆనందబాబు కు స్థానం దక్కింది. మంత్రిగా తిరిగి ఆయన టిడిపి నుండి పోటీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక, ఇదే సమయంలో గత సెంటిమెంట్ మరలా వర్కవుట్ అవుతుందా అనే టెన్షన్ మాత్రం టిడిపి నేతలను వీడటం లేదు.