రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు : వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి
విజయనగరం:వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం ఆయన అరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటు నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశాలకు పార్టీ మరో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డితో కలసి హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలే విజయవంతమయ్యాయని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటు నియోజకవర్గ బూత్ లెవల్ కమిటీ సమావేశంలో వైసిపి ఎంపి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విజయనగరం పేరులోనే విజయం ఉందని, జిల్లాలోని ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు.
అనంతరం వైసిపి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలే విజయవంతమయ్యాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపిదే విజయం అన్నారు. బూత్ లెవల్ కన్వీనర్లు సైనికుల్లా పని చేయాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.