భార్యను వేధిస్తున్నాడని చంపేశాడు చివరికిలా..
తన భార్యను వేధించిన ఓ యువకుడిని హత్య చేసిన నిందితుడికి జీవితఖైదు విధించడంతో పాటు మూడు వేల రూపాయాల జరిమానాను విధిస్తూ ఏలూరు కోర్టు ఆదేశించింది
ఏలూరు:తన భార్యను వేధించిన ఓ యువకుడిని హత్య చేసిన నిందితుడికి జీవితఖైదు విధించడంతో పాటు మూడు వేల రూపాయాల జరిమానాను విధిస్తూ ఏలూరు కోర్టు ఆదేశించింది.
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బడుగు అలీకి తల్లిదండ్రులు చనిపోయారు.దీంతో ఆయన తన బంధువైన బడుగు ప్రేమావతి వద్ద నివాసం ఉంటున్నాడు.
అయితే అదే గ్రామానికి చెందిన కూరెళ్ళ వెంకటేశ్వర్ రావు భార్యను అలీ వేధిస్తున్నాడు. ఈ విషయమై వెంకటేశ్వర్ రావు అలీ పై కక్ష పెంచుకొన్నాడు. 2013 డిసెంబర్ 23వ, తేదిన అదే గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వర్ రావు వచ్చి సెంటర్ కు వెళ్దామని చెప్పి అలీని తీసుకెళ్ళాడు.
అలీని వెంకటేశ్వర్ రావు మద్యం షాపుకు తీసుకెళ్ళి మద్యం తాగించాడు. ఆంజనేయస్వామి గుడి సమీపంలోకి తీసుకెళ్ళి అలీని చంపేసి పూడ్చిపెట్టాడు.
అలీ కన్పించకపోవడంతో ప్రేమావతి పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.దర్యాప్తులో పోలీసులకు వెంకటేశ్వర్ రావుపై అనుమానం వచ్చింది.
పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. దీంతో అతణ్ణి ఏలూరు రూరల్ సిఐ సుభాకర్ అరెస్టు చేశారు. ఈ కేసు ఏలూరులోని జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ సాగింది.
నిందితుడైన వెంకటేశ్వర్ రావుపై నేరం రుజువుకావడంతో జీవిత ఖైదుతో పాటు మూడు వేల రూపాయాల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పును విధించారు. ఈ హత్యతో చింతా వెంకటేశ్వర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. అయితే పదేళ్ళపాటు ఆయన ప్రవర్తనపై పీవో యాక్టును విధించింది కోర్టు.