ఏలూరు వింతవ్యాధి ఫలితం- కేంద్రం కీలక ఆదేశం- ఆ వివరాలు బయటపెట్టొద్దని
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కారణంగా దాదాపు 600 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నిన్న కూడా 17 మంది వింతవ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో మరో 64 మంది కోలుకుని ఇంటిబాట పట్టారు. మరోవైపు ఈ వ్యాధికి గల కారణాలను తేల్చేందుకు ఎయిమ్స్, సీసీఎంబీతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకూ అందిన ప్రాధమిక అంచనా ప్రకారం తాగునీటిలో సీసం, నికెల్, ఆర్గానో క్లోరిన్ వంటి పురుగుమందుల అవశేషాలు కలవడం వల్లే ఈ వింతవ్యాధి వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన ఓ ఆదేశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏలూరు వింతవ్యాధి అసలు కారణమిదే..
ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలు కావడానికి అసలు కారణం కూరగాయలే అన్నది ప్రాధమికంగా కేంద్రం కూడా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పురుగుమందులు చల్లిన కూరగాయల విచ్చలవిడి వాడకం వల్లే ఈ వింతవ్యాధి వచ్చిందని తెలుస్తోంది. తాగునీటిలో వేలాది రెట్లు అధికంగా ఉన్న పురుగుమందుల అవశేషాలు కూడా పలుచోట్ల ఈ వింతవ్యాధికి కారణంగా చెబుతున్నారు. అయితే ఏలూరులో కృష్ణా, గోదావరి రెండు నదుల జలాలు తాగునీరుగా వాడుతున్న నేపథ్యంలో మొత్తం ఊరికి కాకుండా కొన్ని ప్రాంతాలకే ఈ వింతవ్యాధి పరిమితం కావడంతో ఇది కూరగాయల వల్లే వచ్చి ఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
కేంద్రం అనుమానం కూడా అదేనా ?
ఏలూరులో వింతవ్యాధికి కూరగాయలపై చల్లిన పురుగుమందుల అవశేషాలే కీలకంగా మారాయి. దీంతో కేంద్రం కూడా ఈ దిశగానే ఏలూరు వింతవ్యాధిని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరులో పర్యటించిన కేంద్ర డాక్టర్ల బృందం రిపోర్టు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చి ఉండే అవకాశాలూ లేకపోలేదు. దీంతో వింతవ్యాధికి కూరగాయలపై చల్లిన పురుగుమందుల అవశేషాలే కారణంగా భావిస్తూ ఇలాంటి పరిస్ధితులు దేశవ్యాప్తంగా మిగతా చోట్ల లేకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు, పండ్లపై పురుగుమందుల అవశేషాలను పరీక్షించే ల్యాబ్లకు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది.
పురుగుమందుల శాతం బయటపెట్టొద్దన్న కేంద్రం..
ఏలూరులో వింతవ్యాధికి కూరగాయలపై చల్లిన పురుగుమందుల అవశేషాలే ఓ ప్రధాన కారణంగా భావిస్తున్న కేంద్రం ఈ వివరాలు బయటికి వస్తే ప్రజల్లో అలజడి రేగుతుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమకు ఈ వ్యాధి సోకుతుందేమోనన్న భయంతో పురుగుమందులకు వ్యతిరేకంగా స్పందించే పరిస్ధితులు తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అంతిమంగా ఇది పురుగుమందుల తయారీ సంస్ధలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో కూరగాయలపై పురుగుమందుల వివరాల్ని పరీక్షించేందుకు హైదరాబాద్లో అందుబాటులో ఉన్న రెండు ల్యాబ్లకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ మొక్కల నిర్వహణ ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్లకు కూరగాయలపై పురుగుమందులు ఎంత శాతం ఉన్నాయో బహిరంగంగా వెల్లడించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ వివరాలు కేవలం తమకు మాత్రమే పంపాలని తెలిపింది.
Recommended Video
కేంద్రం ఆదేశాలపై సర్వత్రా చర్చ..
గతంలో కూరగాయలు, పండ్లపై పురుగుమందుల అవశేషాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఈ ల్యాబ్లు కూడా పురుగుమందుల అవశేషాలను బయటపెట్టేవి. వీటి ఆధారంగా హైకోర్టు కూడా ప్రభుత్వాలను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం వీటి వివరాలు బయటపెట్టొద్దంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమవుతున్నాయి. పురుగుమందుల వివరాలు బయటికొచ్చినా పండ్ల, కూరగాయాల వ్యాపారులు వాటిని లెక్కచేయకుండా మార్కెట్లో అమ్ముకునే వారు. ఇప్పుడు ఆ వివరాలు బయటికి రాకపోతే వీరి దందా మరింత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.