ఏలూరు: 556కు చేరిన వింత వ్యాధి బాధితులు, సీసం, నికెల్, పురుగుమందు అవశేషాల గుర్తింపు
పశ్చిమగోదావరి: అంతుపట్టని వ్యాధి కారణంగా ఏలూరులో ఆస్పత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య 556కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, 459 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.
పురుగమందు అవశేషాలు
ఇక మెరుగైన వైద్యం కోసం ఇప్పటి వరకు 30 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియా పరిశీలనకు 22 నీటి నమూనాలను సేకరించగా, వాటిలో పురుగుమందుల అవశేషాలున్నట్లు గుర్తించారు.
సీసం, నికెల్ అవశేషాలు కూడా..
మొత్తం 62 మంది నమూనాలు సేకరించగా వాటిలో 10 నమూనాల్లో పరిమితికి మించి సీసం, నికెల్ ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 40 మంది నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు పంపినట్లు వెల్లడించింది. వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ పరీక్షల్లో వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని పేర్కొంది.
ఇప్పటికే ఇద్దరు మృతి..
కూరగాయల నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు, కణజాల పరీక్ష కోసం 10 మంది నమూనాలను సీసీఎంబీకి పంపామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలను పంపినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. కాగా, ఈ వ్యాధి బారినపడి ఇప్పటి వరకు ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.
Recommended Video
తగ్గుముఖం పడుతోంది.. ఆందోళన వద్దు
కాగా, ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తగ్గుముఖం పడుతోందని ఇంఛార్జీ డీసీహెచ్ఎస్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ వెల్లడించారు. రోగులు తిన్ని ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపామని, అయితే, వ్యాధికి గల కారణాలేంటో ఇప్పటికీ తెలియరాలేదని తెలిపారు. అయితే, పంటలపై వాడే పురుగుమందులు కూడా కారణం కావొచ్చని ఆయన తెలిపారు. వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఏలూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.