ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి భయోత్పాతం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి నాటికి మిస్టరీ వ్యాధికి గురైన బాధితుల సంఖ్య ఇంకా పెరిగింది. ఏపీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నది. ఎంతకూ అంతుపట్టని జబ్బుపై అధ్యయనం చేసేందుకు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగనుంది..
Recommended Video
ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమం
ఏలూరుకు WHO టీమ్..
ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తుండటం, అదేమిటో కనిపెట్టేందుకు స్థానిక, జాతీయ నిపుణులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జగన్ సర్కారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను ఆశ్రయించింది. ఏలూరులో పర్యటించి, పరిస్థితిని అంచనా వేయాల్సిందిగా కమిషనర్ ద్వారా అభ్యర్థన పంపడంతో దీనికి డబ్ల్యూహెచ్ఓ సమ్మతి తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి నిపుణులైన ప్రతినిధి బృందం మంగళవారం ఏలూరుకు రానుంది. మరోవైపు..
పెరుగుతోన్న కేసులు.. భయం భయం..
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో సోమవారం రాత్రి నాటికి అస్వస్థతకు గురైనవారి సంఖ్య 451కి చేరింది. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 263 మంది కోలుకోగా, ప్రస్తుతానికి 171 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించారు. వింత వ్యాధి కారణంగా ఆదివారం శ్రీధర్ అనే స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు.
దోమల మందే కారణమా?
ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా? అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆర్గానో క్లోరినో' అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశముంది. మరోవైపు, అంతుచిక్కని అనారోగ్య సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం కూడా మంగళవారమే ఏలూరుకు రానుంది.
ఏలూరులో 84 హెల్త్ క్యాంపులు..
ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి, కలెక్టర్, వైద్యాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ తరహా కేసులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. తొమ్మిది వార్డులకు ప్రత్యేక డాక్టర్ను నియమించడంతో పాటు.. ప్రతి 9 బెడ్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. 84 వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారం పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాస్పత్రుల్లో నోడల్ ఆఫీసర్స్ నియమించడంతో పాటు, మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు.
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుస