పీఆర్సీపై వెనక్కి తగ్గేదే లేదు.. 21న సీఎస్కు సమ్మె నోటీసులు.. ఉద్యోగ సంఘాల అల్టీమేటం
ఆంధ్రపదేశ్ ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈమేరకు విజయవాడలోని ఓ హోటల్లో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై తామంతా ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఉద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణ
శుక్రవారం మరో సారి సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ, పోరాటం, విధి, విధానాలు రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయా సంఘాలు తీసుకున్న నిర్ణయాల మేరకు ఆందోళనలు, నిరసలు నిర్వహించామని పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రేపటి నుంచి ( శుక్రవారం ) ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టాలన్నా నాలుగు సంఘాలు కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు..
కొత్త పీర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదేలేదు.
జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త పీఆర్సీతో ప్రతి ఉద్యోగికి నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. అందుకే ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ఉద్యోగ సంఘాల మధ్య చిన్న చిన్నబేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని పక్కన పెట్టి పోరాటాం సాగిస్తామన్నారు. ఉత్తమమైన పీఆర్సీ సాధించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కొత్త పీర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు
21న సీఎస్కు సమ్మె నోటీసులు
శుక్రవారం సమావేశంలో ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనలు, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల భవితష్యత్తును దృష్టిలో పెట్టుకోని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేపు సీఎస్కు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లు ఏపీ జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. దీనిపై మిగతా ఉద్యోగ సంఘాల నేతలతో కూడా చర్చించనున్నట్లు తెలిపారు.