మంగళగిరిలో విధులు బహిష్కరించిన రెవెన్యూ సిబ్బంది: నిరసన, మద్దతు పలికిన ఏపీఎన్జీఓ
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగుల దాడి ఘటన కలకలం రేపుతోంది. భూకబ్జాదారుల దాడికి నిరసనగా మంగళగిరిలో రెవెన్యూ సిబ్బంది సోమవారం విధులను బహిష్కరించారు.
తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్వో అసోసియేషన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులను నిరసించాల్సిందేనని ప్రకటించిన ఏపీఎన్జీఓల సంఘం కూడా వీఆర్వోల నిరసనకు మద్దతు తెలిపింది. ముందుగా మంగళగిరి రెవెన్యూ ఆఫీసులో వీఆర్వో అసోసియేషన్ నేతలు భేటీ అయ్యారు.
ఆత్మకూరు వీఆర్వో, వీఆర్ఏలపై దాడికి పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము 3 రోజులు వర్క్ టూ రూల్, రెండు రోజులు పెన్డౌన్ చేస్తామని హెచ్చరించారు.
ఇది ఇలా ఉంటే ఆత్మకూరు రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఘటనకు సంబంధించి ఆరుగురి నిందితుల్లో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో చెరువు భూములను ఆక్రమించుకున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై కొంతమంది స్ధానికులు విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెవెన్యూ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.