అమ్మో ఒకటో తారీఖు.. వేతన జీవి ఎదురుచూపులు.. జీతం ఖాయమేనా ?
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో పది రోజులకు పైగా దుకాణాలు, సంస్ధలు, పరిశ్రమలు, మాల్క్ అన్నీ మూతపడటంతో మార్చి నెల జీతాల చెల్లింపు ఉంటుందా లేదా అన్న ఆందోళన ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రతిపాదిస్తుండగా.. ప్రైవేటు యాజమాన్యాలు ఆ మాత్రం హామీ కూడా ఇవ్వడం లేదు. దీంతో జీతాలు అందుకోవాల్సిన తరుణంలో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
ఏపీలో ఉద్యోగులపై లాక్ డౌన్ ప్రభావం...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలన్నీ మూతపడ్డాయి. కేవలం కొన్ని సంస్ధలు మాత్రమే ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోం ఆప్షన్ ఇచ్చాయి. మిగిలిన వారంతా ఉద్యోగాలు వదిలి ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ధితి. అయితే ఖాళీగా ఉన్నారు సరే నెలాఖరు వచ్చేసింది. జీతాలు వస్తాయా లేదా అనేది ఇప్పుడు వారిలో ఆందోళన. పది రోజులుగా తమ సంస్దలు మూతపడటంతో వ్యాపారాలు నష్టపోయామని భావిస్తున్న ప్రైవేటు సంస్ధలు ఉద్యోగుల జీతాల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.
వ్యాపారాలు లేక వెలవెల..
నిత్యం రద్దీగా కనిపించే ఎన్నో వ్యాపారాలు కరోనా వైరస్ ప్రభావంతో మూతపడ్డాయి. దీని ప్రభావం అప్పటికప్పుడే కనిపించకపోయినా నెలాఖరు వచ్చేసరికి ఖర్చుల రూపంలో బయటపడుతుంది. దీంతో ఇప్పుడు వ్యాపార సంస్ధల యాజమాన్యాలు లాక్ డౌన్ నేపథ్యంలో నష్టాల బాటలో ఉన్న తాము ఉద్యోగుల వేతనాలు చెల్లించలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. మరికొన్ని సంస్ధలైతే సగం జీతమే ఇస్తామని ప్రతిపాదిస్తున్నాయి. అదీ వద్దంటే ఉద్యోగాలు వదిలివెళ్లాలని హెచ్చరిస్తున్నాయి.
యాజమాన్యాల వైఖరితో ఆందోళన..
ఏపీలో విభజన తర్వాత వ్యాపారాల పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. అంతకు ముందు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు జోరుగా వ్యాపారాలు సాగించిన వారంతా ఆ తర్వాత డీలా పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో పన్నుల ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన లాక్ డౌన్ ఇప్పుడు ప్రైవేటు సంస్ధలకు శరాఘాతంగా మారిపోయింది. మిగతా ఖర్చుల సంగతి ఎలా ఉన్నా.. ఉద్యోగుల వేతనాల పేరుతో అతిపెద్ద భారాన్ని మోసేందుకు సంస్ధలు సిద్ధంగా లేవు. ఇదే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోతోంది.
ఇప్పటికే స్వస్ధలాలకు పయనం..
కరోనా లాక్ డౌన్ కారణంగా సంస్దలు మూతపడటంతో ఉపాధి కరవై, చేతిలో డబ్బులు సరిపోక ఇప్పటికే వేల సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగులు ఏపీలోని తమ స్వస్ధలాలకు వెళ్లిపోయారు. వీరంతా ఇప్పుడు యాజమాన్యాలు తమపై కనికరం చూపుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 1 తర్వాత ఏదో రకంగా, ఎంతో కొంత వేతనం ఇచ్చి తీరుతాయని వారు ఆశాభావంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఎటు చూసినా అలాంటి పరిస్దితి కనిపించడం లేదు. బ్రాండెడ్ సంస్ధలే వేతనాలను, ఉద్యోగులను కత్తిరిస్తున్న వేళ.. చిన్నాచితకా సంస్ధల నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించలేమని నిపుణులు కూడా చెప్తున్నారు.