అర్చక నిధుల కోసం లంచం డిమాండ్: రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ!
డాక్యుమెంట్స్ పరిశీలించిన వెంకటేశ్వర్లు.. అర్చక నిధి ఇన్చార్జ్ బిందుబాయ్ ను సంప్రదించాల్సిందిగా చెప్పారు. దీంతో బిందుబాయ్ వద్దకు వెళ్లగా. ఆమె రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు.
కర్నూలు: పరిహారం కోసం వచ్చిన వ్యక్తుల నుంచి లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు దేవాదాయ శాఖ అధికారులు. మృతి చెందిన ఓ పూజారి కుటుంబానికి అర్చక నిధులు మంజూరు చేసేందుకు గాను వీరిద్దరు రూ.1లక్ష లంచంగా డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ జయరామరాజు అధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈ గుట్టు బయటపడింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. డోన్ మండలం కొత్తకోట చెన్న కేశవస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసిన శేషయ్య గతేడాది మృతి చెందారు. ఆయన కుటుంబానికి అర్చక నిధి నుంచి రూ.2.50లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో శేషయ్య భార్య పద్మావతి అర్చక నిధి కోసం దేవాదాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
ఈ నేపథ్యంలో మంజూరైన నిధుల కోసం అసిస్టెంట్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బి.వెంకటేశ్వర్లను పద్మావతి సంప్రదించారు. డాక్యుమెంట్స్ పరిశీలించిన వెంకటేశ్వర్లు.. అర్చక నిధి ఇన్చార్జ్ బిందుబాయ్ ను సంప్రదించాల్సిందిగా చెప్పారు. దీంతో బిందుబాయ్ వద్దకు వెళ్లగా. ఆమె రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు. ఇన్ స్పెక్టర్ మరో రూ.2వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో పద్మావతి ఏసీబీని ఆశ్రయించింది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4గం. సమయంలో పద్మావతి అల్లుడు రాధాకృష్ణమూర్తి, అతని అన్న పూజారి వెంకటరమణతో కలిసి అధికారులకు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం.. రిమాండ్కు తరలించారు.