కరోనా బారిన వైసీపీ నేతలు: మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్: హైదరాబాద్లో ట్రీట్మెంట్
ఒంగోలు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్వర్కర్ల వంటి ఫ్రంట్లైన్ వారియర్లకు సోకింది. ప్రజా ప్రతినిధులనూ వెంటాడుతోంది. ఇప్పటికే ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. కోలుకుంటున్నారు. తాజాగా విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొద్దిరోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు. జ్వరం ఉన్న సమయంలో ఆయనకు కరోనా పరీక్షలను నిర్వహించారు. మొదట్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. జ్వరం తగ్గకపోవడంతో మరోసారి ఆయన శాంపిళ్లను సేకరించి, పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనితో వెంటనే ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. కరోనా ప్రారంభదశలో ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించినట్లు చెప్పారు.
ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాకే చెందిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్కు కరోనా వైరస్ సోకింది. అదే జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన భార్య కరోనా పాజిటివ్గా నిర్ధారితులు అయ్యారు. కడపకు చెందిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనాతో బాధపడుతున్నారు.
రామమందిరం నిర్మాణానికి అందిన విరాళాలు ఎంతో తెలుసా? విదేశీ డొనేషన్లను ఎందుకు స్వీకరించట్లేదు?
Recommended Video
వారంతా హోమ్ క్వారంటైన్లలో ఉంటున్నారు. ఇదివరకు విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, అదే జిల్లాకు చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కరోనా బారిన పడి, కోలుకున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా కరోనా బారిన పడటంతో కలకలం చెలరేగుతోంది.