ఆ ఇంజనీరింగ్ విద్యార్థి గజదొంగ, బ్యాచిలర్స్ గదుల్లో..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి గజదొంగగా మారాడు. కూకట్పల్లి ప్రాంతంలో పోలీసులు ఓ గజదొంగను శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 59 ల్యాప్టాప్లు, 470 గ్రాముల బంగారం, 440 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తును రూ.29 లక్షల విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అతని పేరు శ్రీనయ్య అని తెలుస్తోంది. కాగా, అతను బ్యాచిలర్ రూముల్లో దొంగతనాలు చేస్తుండేవాడు.
ములుగులో దొంగల బీభత్సం
వరంగల్ జిల్లా ములుగులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో దంపతుల పైన కత్తితో దాడి చేసి ఎనిమిది తులాల బంగారం అపహరించారు. దుండగుల దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ములుగు, ప్రేమ్ నగర్, జాకారంలోను దొంగలు పడ్డారు. సుమారు ఇరవై ఇళ్లలో దోపిడీకీ పాల్పడ్డారు. అడ్డు వస్తే రాడ్లు, కత్తులతో దాడి చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ శివారులో జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న ట్రాక్టరును కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నారాయణ, కార్తీక్ మృతి చెందారు.
సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి
వరంగల్ జిల్లా శాయంపేటలో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ తన కుమార్తెతో కలిసి నేరేడుపల్లికి వచ్చారు. గురువారం రాత్రి తన మొబైల్ చార్జింగ్ పెట్టెందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మృతురాలి భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.