ఫేర్వెల్ డబ్బు వివాదం: పిడిగుద్దులు, ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ ఏకంగా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న వంశీధర్ రెడ్డి, ధనరాజ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ధనరాజ్ మెడ పైన వంశీధర్ రెడ్డి పిడిగుద్దులు కురిపించడంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేర్ వెల్ ఫంక్షన్ విషయమై వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఫేర్వెల్ పార్టీ కోసం డబ్బులు వసూలు చేసే అంశంపై ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని తీసింది. సోమవారం ఉదయం కళాశాలలో మెకానికల్ విభాగం మూడో సంవత్సరం తరగతి గదిలో ఫేర్వెల్ పార్టీ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వంశీధర్ రెడ్డి... ధన్రాజ్ను డబ్బులు అడిగాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగి, ఘర్షణకు దారి తీసింది. వంశీధర్ రెడ్డి.. ధన్రాజ్ను కొట్టడంతో అక్కడికి అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన విద్యార్థులు కళాశాల వాహనంలో అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ధన్రాజ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థరించారు. కుమారుడి మరణవార్త తెలుసుకొని ధనరాజ్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు వంశీధర్రెడ్డిని అరెస్ట్ చేశారు.