నేనెందుకు బతకాలి?: పరీక్షల్లో, ప్రేమలో ఫెయిలై విద్యార్థి ఆత్మహత్య
ఒకవైపు చదువులో, మరోవైపు ప్రేమలో ఫెయిలయ్యాడు. జీవితమంటే ఈ రెండు మాత్రమే అనుకున్నాడు పాపం. క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడు.
హైదరాబాద్: ఒకవైపు చదువులో, మరోవైపు ప్రేమలో ఫెయిలయ్యాడు. జీవితమంటే ఈ రెండు మాత్రమే అనుకున్నాడు పాపం. క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన చందసాని సాంబయ్య రైతు. అతని కుమారుడు చందసాని రఘుమోహన్(22)ను ఉన్నత చదువులు చదివించి, ఉన్నతస్థాయిలో రాణించేలా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు.
ఇంజనీరింగ్ వరకు చదివించారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో మూడు సబ్జెక్టులలో ఫెయిలయ్యాడు. అతని రూమ్మేట్ ఆదివారం బయటకు వెళ్ళి తిరిగి వచ్చాడు. అప్పటికే రఘుమోహన్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
అతని వద్ద దొరికిన సూసైడ్ నోటు దొరికింది. తన తల్లిదండ్రులకు లేఖ రాసి చనిపోయాడు.
'నేను మంచి చదువులు చదివి.. ఉన్నత స్థాయిలో రాణించాలని మీరు కలలుగన్నారు. మీకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ లోటు లేకుండా నన్ను చదివించారు. మీరు చెప్పినట్లుగానే ఇంజినీరింగ్ వరకు చదివా. చివరి ఏడాది పరీక్షలో ఫెయిలయ్యా. అమ్మ.. నాన్న మీరు కన్న కలల్ని నిజం చేయలేకపోయా. మీకు నా ముఖం ఎలా చూపించను? నేను ఓ అమ్మాయి మనసు తెలుసుకోకుండా ఆమెను ప్రేమించా. ఆమె నన్ను ఎప్పటికైనా ప్రేమిస్తుందని ఈ రోజు వరకు ఎదురు చూశా. చివరకు ఆమె నన్ను ప్రేమించడంలేదని తెలిసింది.. ప్రేమలో.. చదువులో రాణించలేకపోయా. చివరకు మీరు కన్న కలల్ని నిజం చేయలేక పోయాను. ఇంకెందుకు నేను బతకాలి? ఎవరి కోసం బతకాలి?' అని రాశాడు.