ఇంజనీరింగ్ విద్యార్థుల వీరంగం:పోలీసులకు బైకులు,కార్ల నంబర్లు ఇచ్చి ప్రిన్సిపాల్ ఫిర్యాదు
విజయవాడ:తమ అభిమాన నేత కుమారుడి పుట్టిన రోజంటూ కృష్ణాజిల్లా కంచికచర్లలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హల్ చల్ చేశారు. కార్లు, బైకులతో కళాశాల ఆవరణలో చక్కర్లు కొడుతూ భయభ్రాంతులకు గురిచేశారు.
ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దౌర్జన్యం చేయడమే కాకుండా కళాశాలకు చెందిన ప్రాపర్టీని ధ్వంసం చేశారు. దీంతో 18 బైకులు, 6 కార్ల నంబర్లు ఇచ్చి కళాశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా వుంటే విద్యార్థులు మద్యం మత్తులోనే ఇలా వీరంగం వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...
ప్రముఖ కథానాయకుడు, టిడిపి నేత తనయుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న వేడుకల సందర్భంగా కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తొలుత కేక్ కోసి సంబరాలు జరుపుకున్న విద్యార్థులు ఆ తర్వాత ర్యాలీ పేరుతో బైక్ లు, కార్లతో చక్కర్లు కొడుతూ కళాశాలలోని వారిని భయబ్రాంతులకు గురిచేశారు.
ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి తమ వాహనాల ర్యాలీతో పక్కనే ఉన్న అమితసాయి ఇంజనీరింగ్ కళాశాలలోకి ప్రవేశించారు. బైక్ లు, కార్ల హారన్లతో ఆ కాలేజీలోని వారిని భయబ్రాంతులకు గురిచేశారు. వారిని అడ్డుకున్న విద్యార్థులు, అధ్యాపకులపై చేయిచేసుకున్నంత పని చేశారు. వీరి గొడవ సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి వారిస్తున్నా వినకుండా వీరంగం వేశారు. వీరి తీరుతో విసిగిపోయిన ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని పోలీసులను,కళాశాల యాజమాన్యాన్ని కోరారని తెలిసింది.
దీంతో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ 18 బైకులు, 6 కార్ల నంబర్లు పోలీసులకు ఇచ్చి వీరిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది.