వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీషు మీడియం స్కూళ్లు: జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తామన్న జగన్ ప్రభుత్వం ఆదిశగా అడుగులు ముందుకేస్తోంది. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వాటినన్నిటినీ పక్కకు పెట్టి ఇంగ్లీషు మీడియం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే వచ్చే విద్యాసంవత్సరం నుంచే అంటే 2020 -21వ సంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రారంభించాలని జీవో జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ప్రైమరీ స్కూళ్లను ఇంగ్లీషు మీడియంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ప్రతిపాదించిన విద్యాశాఖ కమిషన్
ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటుకు ఓ కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నివేదిక అందించాలని కోరింది. దీని ప్రకారం విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వ, ఎంపీపీ స్కూళ్లు, జిల్లా పరిషద్ స్కూళ్లను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మారుస్తూ.. అదే సమయంలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠాలను ఇంగ్లీషులోనే బోధించాలనే ప్రతిపాదన ఉంచారు. అది కూడా 2020-21నుంచే అమల్లోకి రావాలంటూ నివేదిక ఇచ్చారు. మరోవైపు 9వ తరగతి 10వ తరగతిలకు ఇంగ్లీష్ మీడియంను 2021-2022 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని సూచించింది.
2020-21 నుంచి ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ప్రారంభం
విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నతపాఠశాలలు, హైస్కూళ్లను 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం మారుస్తున్నట్లుగా జీవో విడుదల చేసింది.ఆ తర్వాత అంటే ఏడవ తరగతి నుంచి 10వ తరగతి వరకు రానున్న కాలంలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడతామని జీవోలో స్పష్టం చేసింది. అదే సమయంలో తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టులను తప్పనిసరి చేసేలా విద్యాశాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొంది.
టీచర్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ఎస్సీఈఆర్టీకి అప్పగింత
ఇక ఇంగ్లీషు మీడియం స్కూళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించింది ప్రభుత్వం. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో బోధించగల ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలో రిక్రూట్ చేసే బాధ్యతను కమిషనర్ తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థుల సంఖ్యను ఆధారంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరింది. టీచర్లకు హ్యాండ్బుక్లు, ఇంగ్లీషు మీడియంలో బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వడం, వారిలో నైపుణ్యతను పెంచడం వంటి బాధ్యతను SCERT తీసుకోవాలని సూచించింది.
Recommended Video
విమర్శలను పక్కనపెట్టి ముందుకు వెళ్లిన జగన్ సర్కార్
మొత్తానికి రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం వచ్చే ఏడాది నుంచే అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష పార్టీలు ఇంగ్లీషు మీడియంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండటంతో రాజకీయంగా ఈ అంశం వేడెక్కింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే విద్యార్థులు లబ్ధి పొందుతారని చెబుతోంది. అలా అని తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంచుతున్నామని తెలుగు సబ్జెక్టును తీసేస్తున్నామని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అధికార పక్షం చెబుతోంది.