మంత్రుల ఇంగ్లీష్ తిప్పలు: జయదేవ్కు 'ఆంగ్ల మీడియా' బాధ్యతలు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇతర పార్టీ నేతల ఆంగ్ల పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
మంత్రులు వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడుతుండటంతో... చంద్రబాబు ఇంగ్లీషు మీడియాతో మాట్లాడే బాధ్యతను ఎంపీ గల్లా జయదేవ్కు అప్పగించారని వార్తలొస్తున్నాయి. మంత్రులు వచ్చీ రాని ఇంగ్లీషు మాట్లాడుతుండటం వల్ల ఇబ్బందులు తెచ్చుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వివిధ అంశాల పైన పార్టీ విధానాలు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తదితరాల విషయంలో ఆంగ్లం పైన పట్టున్న జయదేవ్ అయితేనే సమర్థవంతంగా చెప్పగలరని భావించి, అప్పగించినట్లుగా తెలుస్తోంది.
గత వారం ఓ ఆంగ్ల ఛానల్తో మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పి నారాయణలు స్పందించారు. వారు సరైనరీతిలో వాదనలు వినిపించలేకపోయారని చంద్రబాబు భావించారని సమాచారం. భద్రతా ఏర్పాట్లలో లోపం వల్ల ప్రమాదం జరగలేదని చెప్పడంలో వారు విఫలమయ్యారు.
అంతకుముందు రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కూడా ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. దీంతో, చంద్రబాబు ఎంపీ గల్లా జయదేవ్కు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇంగ్లీషులో మాట్లాడే వారిని గుర్తించే వరకు ఎవరు చర్చా కార్యక్రమాల్లో పాల్గొనరాదని చెప్పారని తెలుస్తోంది.