దేవాదాయ శాఖలో లైంగిక వేధింపులపై విచారణ:ఎంక్వైరీ ఆఫీసర్ గా ఆర్జేసీ భ్రమరాంబ
అమరావతి:దేవాదాయ శాఖలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల అంశంపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. కమిషనరేట్లో పనిచేసే సీనియర్ ఉద్యోగి తనను వేధిస్తున్నాడంటూ అదే కార్యాలయం ఉద్యోగి ఇటీవలే మంత్రి కేఈ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేసిన సంగతిత తెలిసిందే.
మహిళా ఉద్యోగి ఫిర్యాదుపై స్పందించిన దేవాదాయ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి వెంటనే విచారణ జరిపించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఇది జరిగి పది రోజులవుతున్నా ఇప్పటివరకూ విచారణకు సంబంధించి కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృపావరంపై చర్యలు తీసుకోవాలని, అలాగే కమిషనరేట్లో మహిళా ఉద్యోగుల వేధింపులకు వ్యతిరేకంగా కమిటీని నియమించాలని కోరుతూ కమిషనర్కు ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం వినతిపత్రం ఇచ్చారు.
కమిషనరేట్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కృపావరం తనను వేధిస్తున్నాడంటూ అదే కార్యాలయం సూపరింటెండెంట్ ఎస్.జ్యోతి ఇటీవల ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఫిర్యాదు చేయడం ప్రభుత్వ శాఖల్లో పెను ప్రకంపనలు రేపింది. ఈ క్రమంలో మంత్రి కెఈ విచారణకు ఆదేశించగా ఆదేశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే మంత్రి కెఈ సీరియస్ గా తీసుకోలేదని...కృపావరం ఏన్జీవో నేత కావడంతో ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు.
ఈ క్రమంలో కృపావరంపై చర్యలు తీసుకోవడంతో పాటు కమిషనరేట్లో మహిళా ఉద్యోగుల వేధింపులకు వ్యతిరేకంగా కమిటీని నియమించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం నాయకులు సోమవారం కమిషనర్ ఎం.పద్మను కలిసి మరోసారి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఆమె వెంటనే స్పందించి మల్టీజోన్-2 రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశాల్లో పేర్కొన్నారు.
అయితే సూపరింటెండెంట్ ఎస్.జ్యోతి ఫిర్యాదుపై ఆర్జేసీని విచారణాధికారిగా నియమించినట్లు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ప్రకటన విడుదల చేశారు. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణ ఉల్లంఘించేవారు ఏ స్థాయివారైనా ఉపేక్షించేది లేదని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో బాధితురాలు ఎస్.జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తాను ఫిర్యాదులో కేవలం మానసిక వేధింపులు అని మాత్రమే రాశానని, కానీ చెప్పుకోలేని విధంగా కృపావరం అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారని, ఈ వేధింపులపై ఏపీఎన్జీవో నాయకులు కూడా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తన ఫిర్యాదుపై పట్టించుకోకపోగా కొందరు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు. తనకు న్యాయం చెయ్యాలని జ్యోతి డిమాండ్ చేస్తున్నారు.