బాలకృష్ణ పిఎపై విచారణ:కోర్టు ఆదేశంతో కదిలిన అధికారులు
హిందూపురం: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్యపై పలు ఆరోపణల నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది. గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక ఉప ఖజానా కార్యాలయంలో జిల్లా ఖజానా సహాయ సంచాలకులు బీవీసీకే సుబ్రమణ్ణేశ్వరశర్మ ఈ విచారణ నిర్వహించారు.
సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ పిఎ వీరయ్య సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నారంటూ ఇందాద్ అనే న్యాయవాది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించక పోవడంతో ఇందాద్ హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయమై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. విచారణ జరిపి పదిరోజుల్లో తమకు నివేదిక పంపాలని అనంతపురం జిల్లా ఖజానా సహాయసంచాలకులను ఆదేశించింది.
దీంతో గురువారం అనంతపురం జిల్లా ఖజానా సహాయ సంచాలకులు బీవీసీకే సుబ్రమణ్ణేశ్వరశర్మ హిందూపురం చేరుకొని న్యాయవాది ఇందాద్ను కలిసి కేసుకు సంబంధించి విచారించారు. వీరయ్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తెదేపా కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘటనలకు సంబంధించి చిత్రాలు, వీడియోలు, వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్ల వివరాలు న్యాయవాది ఇందాద్ ఈ సందర్భంగా విచారణ అధికారికి అందించారు.
విచారణకు హాజరు కావాలంటూ బాలకృష్ణ పిఎ వీరయ్యకు ముందే ఆదేశాలు జారీచేసినా, తాను అందుబాటులో లేనందున హాజరుకాలేనని సమాచారం పంపినట్లు తెలిసింది. దీంతో ఆయనను విచారించే అవకాశం లేక విచారణాధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పటివరకు విచారణకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు సుబ్రమణ్ణేశ్వరశర్మ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ విచారణలో ఖజానా అధికారులు పార్థసారథి, రామాంజనేయులు పాల్గొన్నారు.అమరావతి సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నవీరయ్యను గత ఏడాది మార్చి6న అనంతపురం ఖజానా కార్యాలయానికి సహాయఖజానా అధికారిగా బదిలీ చేశారు. అనంతరం ఆయన డిప్యూటేషన్పై ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యక్తిగత కార్యదర్శిగా వెళ్లారు. పాత పిఎ శేఖర్ పై పలు ఆరోపణల నేపథ్యంలో ఆయనపై వేటు పడటంతో ఆయన స్థానంలో వీరయ్య రావడం, వీరయ్య సైతం ఆరోపణలు ఎదుర్కొంటుడటం గమనార్హం.