అమరావతిపై చంద్రబాబు షాక్: అమరావతి పర్యావణానికి గొడ్డలిపెట్టు?
విజయవాడ: అమరావతి ప్రాంతంలో, మరీ ముఖ్యంగా కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణం పర్యావరణానికే గొడ్డలిపెట్టు అని పర్యావరణ జాతీయ ట్రిబ్యునల్లో పోరాడుతున్న సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ నేతృత్వంలోని నిపుణుల బృందం అభిప్రాయపడింది. రెండురోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసింది.
ట్రిబ్యునల్లో పర్యావరణ పరిరక్షణ కోసం వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సంజయ్ పారిక్, ప్రొఫెసర్ విక్రం సోని శుక్ర, శనివారాలు రెండురోజులపాటు మొత్తం 29 గ్రామాల్లోను పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఉద్ధండరాయునిపాలెం లంక, మరో రెండు లంకలను సందర్శించి ఆదివారం ఢిల్లీకి వెనుదిరిగారు.
ట్రిబ్యునల్లో ఈ కేసు దాఖలైన తొలి రోజుల్లో ప్రభుత్వ న్యాయవాది గంగూలీ లంక గ్రామాల్లో ఎవరూ నివసించటం లేదని వాదించారని న్యాయవాది పారిక్ చెప్పారు. వాస్తవ పరిస్థితులను చూసి సాక్ష్యాధారాలతో ట్రిబ్యునల్కు వివరించేందుకు తాను పర్యటించినట్లు తెలిపారు. నదీ తీరంలో నదీ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేలా చట్టవిరుద్ధంగా ఇసుక తెన్నెలపై ఎత్తయిన మెరకలు వేసి దానిపై రోడ్లు నిర్మించటంతో పాటు ఫ్లడ్లైట్లు కూడా ఏర్పాటు చేశారని, ఇది ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

రాజధాని ప్రాంతంలో ప్రధానంగా లంక గ్రామాల్లో దళితులు, గిరిజనులు వేలాదిమంది నివసిస్తున్నారని, ఏటా మూడు పంటలు పండే భూములన్నింటిని ప్రభుత్వం స్వాధీనపరచుకుని నిర్మాణాలు సాగించడంతో వారంతా ఉపాధి కోల్పోయారని అన్నారు. లంక గ్రామాల్లో ప్రజలు సంతోషంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అక్కడ కమ్యూనిటీ హాళ్లు, చర్చిలు కూడా ఉన్నాయని 90 దళిత కుటుంబాలు, పలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని చెప్పారు.
నాలుగు ప్రాంతాల్లో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని, అదంతా మాఫియా చేతుల్లే ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. అక్కడి ప్రజల ఆవేదనలను మొత్తం వీడియా రికార్డు చేసినట్లు తెలిపారు త్వరలోనే అన్నాహజారేను ఈ ప్రాంతంలో పర్యటించేలా ఏర్పాటు చేస్తున్నామని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications