కృష్ణా నదిలో దూకి ఈవో అనిత ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?
అమరావతి: గుంటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొందుగలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఈవో అనితగా పోలీసులు గుర్తించారు.
దైదా ఆలయంతోపాటు గురజాలలో మరో గుడికి కూడా అనిత ఈవోగా పనిచేస్తున్నారు. అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆమెను నవంబర్ 18న ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గురజాల ఆలయ లెక్కల్లో తేడా రావడంతోనే అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వ్యవహారంలో విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, భర్తతో కూడా అనితకు ఈ మధ్య కాలంలో గొడవలు జరగడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం స్పందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అనితది అనుమానాస్పాద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.