టిడిపి హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం:మంత్రి అఖిలప్రియ
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు.
ఏపీ కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మంత్రి భూమా అఖిల ప్రియను మర్యాదపూర్వకంగా వెలగపూడి సచివాలయంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కాపుల సంక్షేమానికి పథకాల అమలు విషయంపై ఏపీ కాపు కార్పొరేషన్ ఎండి శివశంకర్ తో చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే నంద్యాలకు కాపు భవన్ మంజూరయిందని, అలాగే ఆళ్ళగడ్డలోనూ కాపు భవన్ ఏర్పాటు చేయాలని ఎండీని కోరినట్లు అఖిల ప్రియ తెలిపారు. దీనికి ఎండి సానుకూలంగా స్పందించారని...ప్రతిపాదనలు రూపొందిస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామని ఎండి తెలిపినట్లు వెల్లడించారు.
అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మహిళలకు టైలరింగ్ శిక్షణ యూనిట్లను ఆరు వరకు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ శిక్షణా కేంద్రాల్లో మహిళలకు ఉచిత శిక్షణతోపాటు 3 వేల రూపాయల స్టయిఫండ్, కుట్టుమిషన్ అందించడం జరుగుతుందన్నారు. కాపు కార్పొరేషన్ నుంచి డ్రైవర్లకు సబ్సిడీపై కార్లు కూడా అందించనున్నామని ఎండి తెలిపారని మంత్రి భూమా అఖిల ప్రియ వివరించారు. వీటన్నింటికీ వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కోరినట్లు మంత్రి అఖిల ప్రియ తెలిపారు.