టిడిపికి ఎమ్మెల్యే రాజీనామా : అక్కడ ఇక వైసిపి ఎమ్మెల్యే..
టిడిపికి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసారు. పార్టీ మారటం కోసం కొద్ది రోజుల క్రితం రావెల కిషోర్ బాబు రాజీనామా చేయగా..ఇప్పుడు సుప్రీం తీర్పు కారణంగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేసారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా తో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైసిపి నుండి పోటీ చేసిన తిప్పేస్వామి ఇక అక్కడ ఎమ్మెల్యేగా కోర్టు తీర్పు మేరకు వ్యవహరించనున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర తెదేపా ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శి విజయ్రాజుకు ఆయన అందజేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందున హైకోర్టు ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ.. ఈరన్నకు అక్కడా ఎదురు దెబ్బ తప్పలేదు. సుప్రీం కోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్ధించింది. దీంతో ఈరన్న తన రాజీనామా లేఖను సభాపతి కోడెల శివప్రసాదరావుకు సమర్పించేందుకు శాసనసభకు వెళ్లారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.
కాగా, ఇప్పటికే వైసిపి నుండి గెలుపొంది 23 మంది ఎమ్మెల్యేలు టిడిపి లోకి ఫిరాయించారు. టిడిపి నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఈ పరిణామాలు సైతం రెండు పార్టీల్లోనూ చర్చ నీయాంశంగా మారుతున్నాయి.