సరంజామా కావాలి: జైపాల్కి ఏరాసు కౌంటర్, తెలివుంటే
హైదరాబాద్: చివరి బంతి ఢిల్లీలో ఆడినా సరంజామా అవసరమని, అందుకు కావాల్సిన దానిని తాము తయారు చేసుకుంటున్నామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆదివారం అన్నారు. చివరి బంతి ఢిల్లీలో ఉంటుందని, అక్కడ ఆడాలని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దీనికి ఏరాసు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. సీమాంధ్ర నాయకులు శుంఠలు అని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో గాడ్సే కూడా పుట్టారని గుర్తుంచుకోవాలన్నారు. సీమాంధ్రులపై ఇష్టారీతిగా మాట్లాడావద్దన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనేది ఊహాజనితమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కొత్త పార్టీ పెట్టి ఏం లాభమని ప్రశ్నించారు. తెలివైన వారు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోరని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన ఓటింగుకు పట్టుబడతామన్నారు.
జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే తాము వదిలేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా అన్నారు. జగన్ సమైక్యతా భావాన్ని టిడిపి నేతలు విమర్శించడం శోచనీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చంద్రబాబును అడగడం చేతకాని వారు జగన్ పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. మాజీ మంత్రి మారెప్ప కొన్ని శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారినట్లు కనిపిస్తోందన్నారు.