పరుష పదజాలంతో సోనియాను తిట్టిన ఏరాసు
కర్నూలు: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విరుచుకుపడ్డారు. ఆమెను మంత్రి పరుష పదజాలంతో దూషించారు. రాష్ట్ర విభజనపై సోనియాను తప్పు పడుతూ సాధారణ ప్రజానీకం కూడా వాడని భాషలో తిట్టిపోశారు. కర్నూలు జిల్లా మహానంది మండలం రచ్చబండ కార్యక్రమంలో ఆయన సోమవారం ఆ చర్యకు పాల్పడ్డారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితికి అన్ని రాజకీయ పార్టీలు కారణమని, అందులో కాంగ్రెసు పాపం కూడా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో తమకు భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. గతంలో కూడా ఆయన సోనియాపై తీవ్రమైన వ్యాఖ్య చేశారు. తన నియోజకవర్గం ఆత్మకూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో గతంలో వ్యాఖ్యలు చేశారు.
తాజా వ్యాఖ్యలతో ఏరాసు ప్రతాప రెడ్డి కాంగ్రెసు పార్టీకి దూరం కావడానికి నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. ఇదే విషయంపై గత కొంత కాలంగా తన నియోజకవర్గం కార్యకర్తలతో ఆయన మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆయన నియోజకవర్గంలో అంటున్నట్లు సమాచారం. భవిష్యత్తు లేనప్పుడు కాంగ్రెసులో ఎలా ఉంటామని ఆయన అడుగుతున్నారు.
కాగా, ఏరాసు ప్రతాపరెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనను ఏరాసు ప్రతాప రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఏరాసు ప్రతాప రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుత్తా రాజశేఖర రెడ్డిని నియమించింది. ఆయనకే టికెట్ లభించవచ్చునని అంటున్నారు.
తన వ్యాఖ్యలపై ఏరాసు ప్రతాపరెడ్డి తర్వాత వివరణ ఇచ్చారు. తాను సోనియా గాంధీని దూషించలేదని ఆయన స్పష్టం చేశారు. విభజన పాపంలో అందరూ భాగస్వాములేనని తాను అన్నట్లు ఆయన తెలిపారు. అందరూ కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారనేదే తన బాధ అని ఆయన అన్నారు.