టిఆర్ఎస్లో చేరాలని ఎర్రబెల్లి చెప్పాడు: ధర్మారెడ్డి, బాబుపై గువ్వల వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై శాసనసభ్యుడు ధర్మారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరాలని తనకు చెప్పింది ఎర్రబెల్లి దయాకర్ రావేనని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
ఎర్రబెల్లి, మరో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పరకాల నుంచి పోటీ చేసేందుకు ఎర్రబెల్లి సిద్ధపడితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడుతానని ఆయన సవాల్ విసిరారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ప్యాకేజీలు తీసుకునే సంస్కృతి ఎర్రబెల్లిదేనని ఆయన అన్నారు. టిడిపి టికెట్పై గెలిచిన ధర్మారెడ్డి ఇటీవల టిఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, సీమాంధ్ర పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ నిర్మాణమైతే తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవనే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారంనాడు ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబునాయుడు మీకు పార్టీ బాద్యతలు అప్పగిస్తారని నమ్ముతున్నారా? అని ఆయన తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అంతరించబోయే పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీ నాయకత్వం కోసం పాకులాడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మునిగిపోయే పార్టీ కోసం పాకులాడుతున్నారంటే మీకు రాజకీయ అవగాహన లేనట్టేనని అన్నారు.