ఏపీలో రూ.400 కోట్ల ఈఎస్ఐ స్కామ్.. విజిలెన్స్ రిపోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు..
తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ ఈఎస్ఐ స్కామ్ వెలుగుచూసింది. ఈఎస్ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్,రమేష్ కుమార్,విజయ్ కుమార్లు ఐదేళ్ల కాలంలో దాదాపు రూ.400 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలిగించారని విజిలెన్స్ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఈడీ సేకరించింది. మెడిసిన్స్,ల్యాబ్ కిట్స్,బయోమెట్రిక్ మెషీన్స్,ఫర్నీచర్,ఈసీసీ సర్వీసులు,బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు తేల్చింది.
132శాతం అధిక ధరకు కొనుగోళ్లు..
వాస్తవ ధర కంటే 132శాతం ఎక్కువ ధరకు మందుల కొనుగోళ్లు చేశారని గుర్తించింది. ఒక్కో బయోమెట్రిక్ వాస్తవ ధర రూ.16వేలు కాగా.. రూ.70వేలకు వాటిని విక్రయించినట్టు గుర్తించింది. నకిలీ కంపెనీల పేరుతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్టు నివేదికలో పేర్కొంది. మెడికల్ కోసం ప్రభుత్వం రూ.293 కోట్లు ఈఎస్ఐకి కేటాయించగా.. అధికారులు రూ.698కోట్ల బిల్లులు సృష్టించినట్టు తేల్చింది. ఈ స్కామ్లో ముగ్గురు డైరెక్టర్లతో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్ల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం.
నివేదికలో అచ్చెన్నాయుడు పేరు..
నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్దతిలోనే చేపట్టాలన్న నిబంధన ఉంది. అయితే అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతి లేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్దతిలోరూ.51కోట్ల మెడిసిన్ కొనుగోళ్లు చేశారని నివేదికలో పేర్కొన్నారు. టెలీ హెల్త్ సర్వీసెస్ అనే కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. విజిలెన్స్ శాఖ ఈ స్కామ్పై ప్రభుత్వానికి నివేదిక అందచేయడంతో.. దీనిపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ స్కామ్కు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Recommended Video
తెలంగాణలో వెలుగుచూసిన కుంభకోణం
తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.200 కోట్లకు పైగా కుంభకోణానికి తెర తీశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆమెతో పాటు పలువురు కీలక పాత్రా పోషించిన వారిని సైతం అరెస్ట్ చేశారు. స్కామ్ విచారణలో భాగంగా దేవికారాణి ఆస్తుల చిట్టా కూడా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఏపీ,తెలంగాణల్లో మొత్తం 50 చోట్ల ఆమెకు ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని షేక్ పేట ఆదిత్య టవర్స్ లో మూడు ప్లాట్లు, చిత్తూరులో కోటి రూపాయల విలువ చేసే బిల్డింగ్, నానక్రామ్గూడలో ఇండిపెండెంట్ హౌస్, ఏపీ, తెలంగాణలో కలిపి 11 చోట్ల ఓపెన్ ప్లాట్స్,తెలంగాణలో ఏడుచోట్ల 32 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ సిటీలో 18 చోట్ల కమర్షియల్ షాప్స్, వైజాగ్ మధురవాడలో ఇండిపెండెంట్ ఇల్లు, ఆరున్నర కోట్ల రూపాయల విలువ చేసే డిపాజిట్లు, 23 బ్యాంకుల్లో రూ.కోటిన్నర వరకు క్యాష్ ఉన్నట్టు గుర్తించారు.