ESI Scam : అచ్చెన్నాయుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది.. ఏసీబీ ప్రశ్నల వర్షం .. కీలక సమాచారం రాబట్టారా ?
ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన నుండి కీలక సమాచారం రాబట్టారా ? ప్రస్తుతం గుంటూరులోని జిజిహెచ్ లో ఆయనను విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు నుండి కీలక సమాచారం రాబట్టడంలో ఎంతమేరకు సక్సెస్ అయ్యారు ? లేఖలు సిఫార్సులతో ఈఎస్ఐ అధికారులపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు ? ఈ వ్యవహారాల్లో మీ ఇంట్రెస్ట్ ఏమిటి అని పలు ప్రశ్నలతో అచ్చెన్నాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికారులు ఈ కేసులో కావలసిన పూర్తి ఆధారాలను సేకరించినట్లేనా? అన్నది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏ 2 నిందితుడు అచ్చెన్నాయుడును మూడో రోజు విచారిస్తున్న ఏసీబీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణంలో గత మూడు రోజులుగా ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును, అలాగే ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లను విచారణ జరుపుతున్నారు. ఈఎస్ఐ స్కాం లో ఏ 2 నిందితుడిగా ఉన్న మాజీమంత్రి టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నేడు మూడవ రోజు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐ స్కాం లో ఏం జరిగిందన్న దానిపై అచ్చెన్నాయుడును ప్రశ్నిస్తున్న అధికారులు, సమాధానం కోసం అడిగిన ప్రశ్నలు పదేపదే తిప్పితిప్పి ప్రశ్నిస్తున్నారని సమాచారం.
అవకతవకల రికార్డులను ముందు పెట్టి ప్రశ్నిస్తున్న ఏసీబీ
నేడు మూడవరోజు కోర్టు అనుమతి ఇచ్చిన చివరి రోజు కావడంతో ఈఎస్ఐ కుంభకోణంలో జరిగిన అవకతవకల రికార్డులను ముందు పెట్టి ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న రెండవ రోజు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ను ఐదు గంటలపాటు విచారణ జరిపారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుడిని, అలాగే న్యాయవాది హరిబాబు అనుమతించిన ఏసీబీ అధికారులు వారి ప్రశ్నలకు అచ్చెన్న ఇస్తున్న సమాధానాలను ఆడియో వీడియో ద్వారా రికార్డ్ చేస్తున్నట్లుగా సమాచారం.
సిఫార్సు లేఖలపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్న ఏసీబీ
టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలను, నిబంధనలకు విరుద్ధంగా మందులను, వైద్య పరికరాల కొనుగోలు, ఫర్నిచర్ కొనుగోలు వంటి అంశాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు మీరు ఇచ్చిన లేఖలు, సిఫార్సులతో ఈఎస్ఐ స్కామ్ జరిగిందని, 150 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అసలు ఆ సిఫార్సు లేఖ రాయడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నించారు.
ఆ కంపెనీలు ముందే తెలుసా ? ఎందుకిలా చేశారు
మీరు సిఫార్సు చేసిన కంపెనీలు మీకు ముందే తెలుసా ? గుర్తింపు కలిగిన కంపెనీలు ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోకుండా గుర్తింపులేని కంపెనీలకు ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు? నామినేషన్ పద్ధతి, నకిలీ కొటేషన్లు, బిల్లులు వంటి వాటితో జరిగిన అవినీతి, అక్రమాల గురించి మీకు తెలియదా ? మీ పాత్ర ఏంటి ? అధికారులు మీరు చెయ్యమంటే చేశామని చెబుతున్నారు ?దీనిపై మీరేమంటారు ?అంటూ అచ్చెన్నాయుడు పై ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ .
Recommended Video
కీలక అంశాలను గుర్తించిన ఏసీబీ
ఇక మూడు రోజుల పాటు జరిగిన విచారణలో ఒక అచ్చెన్నాయుడు మాత్రమే కాకుండా,ఈ కేసుతో ప్రమేయం ఉన్న కీలక అధికారులను కూడా విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు కీలక అంశాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టిడిపి హయాంలో జరిగిన ఒక్కో స్కామ్ ను వెలుగులోకి తీసుకు వచ్చి నాడు టిడిపి హయాంలో మంత్రులుగా ఉన్నవారి అవినీతి భరతం పట్టాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రస్తుతం అచ్చెన్నాయుడుపై, ఈఎస్ఐ కుంభకోణంపై వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.